భర్తకి 12 మంది స్త్రీలతో వివాహేతర సంబంధం, భార్యను 8 సార్లు కత్తితో పొడిచాడు
బీహారు రాష్ట్రంలో దారుణం జరిగింది. భాగల్పూర్ జిల్లాలో ఓ వ్యక్తి తన భార్యను కత్తితో 8 సార్లు పొడిచాడు. జిమ్ పెట్టుకునేందుకు తనకు రూ. 5 లక్షలు కావాలంటూ భార్యపై ఒత్తిడి చేయగా అందుకు ఆమె ససేమిరా అంది. దానితో అతడు ఆమెను విచక్షణారహితంగా కత్తితో పొడిచినట్లు పోలీసులు తెలిపారు.
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. బీహారు లోని కోయిల్ఘాట్కు చెందిన ప్రేమరాజ్ యాదవ్, సంజులు ఏడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా వున్నారు. ప్రేమరాజ్ యాదవ్ గవర్నమెంట్ కార్పొరేషన్లో ఉద్యోగిగా వున్నాడు. ఐతే పరాయి మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్న ప్రేమరాజ్ భార్యాపిల్లల్ని పట్టించుకోవడం మానేశాడు. భార్యాపిల్లల పట్ల బాధ్యత లేకపోగా చీటికిమాటికి డబ్బు కోసం భార్యను వేధిస్తుంటాడు. ఈక్రమంలో గురువారం నాడు భార్యతో మరోసారి గొడవకు దిగాడు.
తనకు రూ. 5 లక్షల డబ్బు కావాలనీ, ఆ డబ్బుతో జిమ్ సెంటర్ ప్రారంభించాలనుకుంటున్నట్లు చెప్పాడు. ఐతే ప్రేమరాజ్ తనతో ఏనాడూ సఖ్యత లేకపోవడంతో అతడికి డబ్బు ఇచ్చేందుకు సంజుల అంగీకరించలేదు. దీనితో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రేమరాజ్ తన భార్యను ఓ గదిలో బంధించి కత్తి తీసుకుని ఆమెను 8 సార్లు పొడిచాడు. దీనితో తీవ్రంగా రక్తస్రావం అవుతుండగా ఫోనులో తన సోదరుడు, తల్లికి సమాచారం ఇచ్చింది. వారు హుటాహుటిన వచ్చి బాధితురాలిని సమీప ఆసుపత్రిలో చేర్పించారు.
ఐనప్పటికీ ఆమె పరిస్థితి విషమంగా వున్నట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు తన అల్లుడు ప్రేమరాజ్ కి 12 మందితో అక్రమ సంబధాలు వున్నట్లు ఆమె అత్త మంజుదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమార్తెను అతడు ఏనాడూ మంచిగా చూసుకోలేదనీ, పెళ్లయిన దగ్గర్నుంచి ఒకటే గొడవలని వెల్లడించింది. అదనపు కట్నం కోసం గోల చేస్తూనే తన కుమార్తె వుండగానే మొత్తం 12 మందితో వివాహేతర సంబంధాన్ని జరుపుతున్నాడంటూ ఆమె ఫిర్యాదు చేసింది. దీనితో అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.