ఐఫోన్లో షూట్ చేస్తే రీల్స్ ఎక్కువగా వస్తాయనీ.. యువకుడి గొంతు కోశారు..
సోషల్ మీడియాలో లైక్ల కోసం, కామెంట్లు కోసం యువత ఎటువంటి దారుణాలకైనా ఒడిగడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఇద్దరు మైనర్లు ఐఫోన్లో రీల్స్ చిత్రీకరిస్తే ఎక్కువ లైకులు వస్తాయనే ఆలోచనతో ఐఫోన్ కోసం ఓ యువకుడి గొంతుకోసి హత్య చేశారు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో జరిగింది.
పోలీసుల కథనం మేరకు.. బెంగుళూరుకు చెందిన షాదాబ్ (19) అనే యువకుడు తన మేనమామ వివాహానికి హాజరయ్యేందుకు ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నాగౌర్ గ్రామానికి వచ్చారు. జూన్ 21వ తేదీ నుంచి అతడు కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులుకు సమాచారం ఇచ్చారు. గాలింపు చేపట్టిన పోలీసులు గ్రామం వెలుపల శిథిలావస్థలో ఉన్న బావి అతడి మృతదేహం ఉన్నట్టు గుర్తించారు. మృతుడి మెడపై కత్తిపోట్లు, తలిపై తీవ్ర గాయాలు ఉండటంతో అనుమానాస్పదంగా మృతి కేసు నమోదు చేశారు.
అతడి ఫోన్ లొకేషన్ ఆధారంగా 14, 16 ఏళ్ళ ఇద్దరు మైనర్ బాలురను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో ఐఫోన్లో రీల్స్ చేయడం వల్ల వీడియోలు హై క్వాలిటీలో వస్తాయనే ఆలోచనతో ఐఫోన్ కోసం అతడిని హత్య చేసినట్టు బాలురు అంగీకరించారు.
ఈ ఘటన జరిగిన రోజున వారు రీల్స్ చేద్దామని చెప్పి షాదాబ్ను ఊరి చివర ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి గొంతుకోసి, బండరాయితో తలపై మోది హత్య చేసినట్టు పేర్కొన్నారు. హత్య అనంతరం ఆయుధాలను దాచడానికి సహకరించిన మరో బాలుడుని కూడా అరెస్టు చేశారు. వారిని గోండా ప్రాంతంలోని డివిజనల్ జువైనల్ హోమ్కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.