1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్

పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న యువతి.. వరుడిని కొట్టి చంపేశారు.. ఎక్కడ?

murder
హైదరాబాద్ నగరంలోని సరూర్ నగరులో దారుణం జరిగింది. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నందుకు వరుడిని కొట్టి చంపేశారు. ఇనుపరాడ్డుతో యువకుడిని కొట్టి చంపేశారు. రక్తపు మడుగులో పడివున్న భర్తను చూసిన భార్య ఒక్కసారి షాక్‌కు గురైంది. ఇది తెలంగాణా రాష్ట్రంలో జరిగిన మరో పరువు హత్య. హైదరాబాద్, సరూర్ నగర్ పీఎస్ పరిధిలో జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రంగారెడ్డి జిల్లా మర్పలికి చెందిన బిల్లాపురం నాగరాజు అనే వ్యక్తి మర్పల్లి సమీపంలోని ఘనాపూర్‌కు చెందిన సయ్యద్ అశ్రిన్ సుల్తానా అనే యువతిని ఏడేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయం తెలుసున్న అశ్రిన్ కుటుంబ సభ్యులు ఈ ప్రేమను వ్యతిరేకించారు. తమను కాదని పెళ్లి చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. 
 
అయితే, అశ్రిన్‌ను పెళ్లి చేసుకోవాలన్న గట్టిపట్టుదలతో నాగరాజు హైదరాబాద్ నగరానికి చేరుకుని ఓ కార్ల కంపెనీలో సేల్స్‌మెన్‌గా ఉద్యోగంలో చేరాడు. ఆ తర్వాత జనవరి నెల ఒకటో తేదీ కొత్త సంవత్సరం రోజున అశ్రిన్‌ను రహస్యంగా కలుసున్న నాగరాజు తన ప్రియురాలిని రహస్య పెళ్లికి ఒప్పించాడు. 
 
ఆ తర్వాత వారిద్దరూ జనవరి 31వ తేదీన హైదరాబాద్ ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో నాగరాజు మరో ఉద్యోగంలో చేరిపోయాడు. 
 
అయితే, వీరిద్దరూ హైదరాబాద్ నగరంలో ఉంటున్నట్టు అశ్రిన్ కుటుంబ సభ్యులకు తెలిసింది. ఈ విషయం తెలిసిన నాగరాజు దంపతులు విశాఖపట్టణానికి వెళ్లిపోయారు. అక్కడే ఉంటూ వచ్చారు. ఇక అంతా సర్దుకుందని భావించిన వారు.. తిరిగి హైదరాబాద్ నగరానికి చేరుకుని, అనిల్ కుమార్ కాలనీలో ఉంటున్నారు. అదేసమయంలో వీరికోసం గాలిస్తున్న అశ్రిన్ కుటుంబ సభ్యులు వీరి ఆచూకీని తెలుసుకుని, హత్య చేసేందుకు ప్లాన్ చేసింది.
 
ఈ క్రమంలో బుధవారం రాత్రి 9 గంటల సమయంలో నాగరాజు దంపతులు అశ్రిన్ కాలనీ నుంచి బయటకురాగానే యువతి సోదరుడు, అతడి స్నేహితుడు బైక్‌పై వెంబడించి జీహెచ్ఎంసీ కార్యాలయ రహదారిపై అడ్డుకున్నారు. ఆ తర్వాత ఇనురాడ్‌తో నాగరాజుపై విచక్షణారహితంగా కొట్టి హత్య చేశారు. 
 
ఈ అనూహ్య ఘటనతో అశ్రిన్‌ను షాక్‌కు గురైంది. రక్తపు మడుగులో పడిన భర్తను చూసి గుండెలవిసేలా రోదించింది. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు అశ్రిన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కాగా, నాగరాజు కుటుంబ సభ్యులు అశ్రిన్‌ను తమతో పాటు తీసుకెళ్ళారు.