1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 9 జనవరి 2024 (15:35 IST)

కుటుంబంలో చిచ్చుపెట్టిన జ్యోతిష్యం.. ఉరి వేసుకోని గృహిణి ఆత్మహత్య

babita
పచ్చని సంసారంలో జ్యోతిష్యం చిచ్చుపెట్టింది. జ్యోతిష్యాన్ని గుడ్డిగా నమ్మే మహిళ ఆత్మహత్య చేసుకుంది. యూట్యూబ్ ఛానల్‌ ద్వారా పరిచయమైన ఓ జ్యోతిషుడు నీ భర్తకు నువ్వు దూరం అవుతావని చెప్పడంతో ఆ మహళ ఆందోళనకు గురైంది. దీంతో ఆమె ఆత్మహత్యకు గురైంది. హైదరాబాద్ నగరంలోని అంబర్ పేటలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ అంబర్‌పేటకు చెందిన బబిత (28), సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రామకృష్ణ అలియాస్ రాము (30)తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. కానాజీగూడ ఇందిరానగర్‌లో కాపురం పెట్టిన దంపతులకు మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. జ్యోతిష్యాన్ని విపరీతంగా నమ్మే బబిత ఓ యూట్యూబ్‌లో చెప్పిన జ్యోతిష్యం విన్నది. అందులో చెప్పినట్టుగా తాము విడిపోతామని బలంగా నమ్మింది. 
 
ఇదే విషయాన్ని భర్తతో తరచూ చెప్తే ఆయన కొట్టిపడేసేవాడు. ఈ క్రమంలో ఆదివారం నిర్వహించిన కుమారుడి పుట్టినరోజుకి బంధుమిత్రులందరూ హాజరయ్యారు. బబిత తల్లిదండ్రులు మాత్రం రాలేదు. సోమవారం ఉదయం రాము విధులకు వెళ్లగా, కుమారుడు అంగన్వాడీకి వెళ్లాడు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అంగన్వాడీ కేంద్రం నుంచి వచ్చి చిన్నారి తల్లి ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని కనిపించంతో కంగారుపడిపోయాడు. వెంటనే కింది పోర్షన్లో ఉండే బాబాయికి చెప్పడంతో ఆయన వచ్చి ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించాడు.
 
అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలిసిన బబిత తల్లిదండ్రులు రాముపై దాడి చేశారు. అదనపు కట్నం కోసం వేధించడం వల్లే కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. అయితే, జ్యోతిష్యాన్ని నమ్మే ఆమె ఆత్మహత్య చేసుకుందని, దానిని నమ్మవద్దని తాను పదేపదే చెప్పేవాడినని రాము చెప్పాడు. ఇటీవల ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకోవడంతో ఆగ్రహం పట్టలేని రాము భార్యపై అందరిముందు చేయిచేసుకున్నాడు. దీంతో ఆమె మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.