1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 19 మే 2025 (15:05 IST)

చీటీ డబ్బుల కోసం ఘర్షణ : ఇంటి యజమానురాలి తల్లి వేలు కొరికిన వ్యక్తి!!

crime
హైదరాబాద్ నగరంలో దారుణం ఘటన చోటుచేసుకుంది. చీటీ డబ్బుల కోసం, ఇంటి అద్దెకు సంబంధించిన వివాదం తీవ్ర ఘర్షణకుదారితీసి, ఓ మహిళ చూపుడు వేలు కోల్పోయేలా చేసింది. ఓ వ్యక్తి అత్యంత కిరాతకంగా ఆమె వేలును కొరికేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జవహర్‍‌ నగర్‌కు చెందిన సుజితకు మధురా నగర్‌లో పెంటో హౌస్ ఉంది. ఆ ఇంట్ల మమత అనే మహిళ గత మూడేళ్లుగా అద్దెకు ఉంటోంది. ఇంటి యజమానురాలు సుజిత వద్ద అద్దెకుంటున్న మమత వద్ద చీటీలు వేసింది. ఈ క్రమంలో సుజిత.. మమతకు సుమారు రూ.30 వేలు చీటీ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, కొద్ది రోజుల క్రితం మమత ఆ ఇంటిని  ఖాళీ చేసి, తన స్నేహితురాలైన సుప్రియకు ఆ ఇంటిని అద్దెకు ఇప్పించింది. కానీ, వారం రోజులు తిరగకుండానే సుప్రియ ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయింది. వెళుతూ వెళుతూ ఇంటి అద్దె కూడా చెల్లించలేదు. 
 
ఈ నేపథ్యంలో తనకు రావాల్సిన చీటీ డబ్బులు వసూలు చేసుకునేందుకు మమత తన భర్త హేమంత్‌తో కలిసి సుజిత ఇంటికి వెళ్లింది. అక్కడ సుప్రియ చెల్లించకుండా వెళ్లిన ఇంటి అద్దెకు డబ్బును తమకు ఇవ్వాలంటూ సుజిత పట్టుబట్టింది. దీంతో ఇరు వర్గాల మధ్య మాటమాట పెరిగి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. గొడవ పెద్దది అవుతుండటంతో సుజిత తల్లి లత (45) జోక్యం చేసుకుని వారిని ఆపే ప్రయత్నం చేసింది. 
 
ఈ క్రమంలో తీవ్ర ఆవేశానికి లోనైన హేమంత్, అడ్డువచ్చిన లత కుడి చేతి చూపుడు వేలుకు బలంగా కొరికేశాడు. ఈ దాడిలో లత వేలు పూర్తిగా తెగి కిందపడిపోయింది. తీవ్ర రక్తస్రావంతో తెగిన వేలితో లత, ఆమె కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి పరుగులు తీశారు. అయితే, తెగిపోయిన వేలును తిరిగి అతికించడం సాధ్యం కాదని వైద్యులు తేల్చిచెప్పారు. 
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న మధురానగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, నిందితుడు హేమంత్‌‌ను అరెస్టు చేశారు. చిన్నపాటి ఆర్థిక వివాదం ఇంతటి దారుణానికి దారితీయడం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. పోలీసులు ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.