గురువారం, 27 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 27 ఫిబ్రవరి 2025 (18:34 IST)

భర్తను వదిలేసి ప్రియుడితో సంతోషంగా గడుపుతున్న మహిళ: చాటుగా తుపాకీతో కాల్చి చంపిన భర్త

gun shot
పెళ్లి చేసుకుని 17 ఏళ్లు దాటినా తనపై చీటికిమాటికి దాడి చేస్తూ వేధిస్తున్న భర్తను భరించలేక వదిలేసింది ఆ మహిళ. అతడి వేధింపులను భరిస్తూనే... ఎన్నోసార్లు అతడికి నచ్చజెప్పింది. ఐనా అతడు తన తీరు మార్చుకోలేదు సరికదా ఎప్పటిలాగే వేధింపులు షురూ చేసాడు. దీనితో తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని గత ఏడాది పుట్టింటికి వచ్చేసింది సావిత్రి అనే ఆ మహిళ. అక్కడే ఆమెకి సర్జీత్ సింగ్ పరిచయమయ్యాడు. ఎంతో సౌమ్యుడు. తన ఇద్దరి పిల్లల్ని స్కూలులో దించి రావడం, తదితర పనులన్నీ చేసి పెడుతున్నాడు. పైగా అతడికి పెళ్లి కూడా కాలేదు. అలా వారి స్నేహం సన్నిహిత సంబంధానికి దారితీసింది.
 
వరసకు మేనత్త కుమారుడు కూడా కావడంతో వారికి ఎవరూ అడ్డు చెప్పలేదు. ఆమె తల్లిదండ్రులతో పాటు సర్జీత్ తల్లిదండ్రులు కూడా సావిత్రి సంతోషంగా వుండాలని కోరుకున్నారు. దానితో సర్జీత్-సావిత్రి సంతోషంగా కలిసి వుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త ఫిబ్రవరి 24న ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లోని ఒక పరీక్షా కేంద్రం వెలుపల తన భార్య కోసం దారి కాచాడు. తన భార్య సావిత్రి, ఆమె ప్రియుడు సర్జీత్ దగ్గరగా రాగానే తుపాకీతో వారిపై కాల్పులు జరిపాడు. వెంటనే అక్కడి నుంచి ద్విచక్రవాహనంపై ఎక్కి పరారయ్యాడు.
 
భార్యను నేరుగా తలపై కాల్చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె ప్రియుడు సర్జీత్ ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్నాడు. తన తండ్రే తన తల్లిపైనా, సర్జీత్ పైనా కాల్పులు జరిపాడని 16 ఏళ్ల కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. తన తల్లిని హత్య చేసిన తండ్రిని కఠినంగా శిక్షించాలని అతడు కన్నీరుమున్నీరై విలపిస్తున్నాడు.