శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జె
Last Modified: సోమవారం, 19 అక్టోబరు 2020 (22:34 IST)

గోవిందా... ఏమిటి రోజుకో వివాదం?

తిరుమల తిరుపతి దేవస్థానంలో రోజుకో విధంగా జరుగుతున్న పరిణామాలు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. సరిగ్గా మూడు రోజుల నుంచి టిటిటి వార్తల్లోకెక్కుతోంది. అందరి నోళ్ళలో నానుతోంది. మొదటిది స్వామివారి నిధులకు సంబంధించి వేరే బ్యాంకులో డిపాజిట్ చేసే అంశం.. రెండవది గోల్డ్ వ్యవహారం.. మూడవది ప్రస్తుతం పింక్ డైమండ్. ప్రతి విషయానికి టిటిడి క్లారిటీ ఇస్తోంది కానీ భక్తుల్లో మాత్రం అనుమానం అలాగే ఉంది.  
 
ప్రస్తుతం గోల్డ్ వ్యవహారం టిటిడిలో పెద్ద చర్చే దారితీస్తోంది. అసలు గోల్డ్ ఏంటి.. దాని వ్యవహారం ఏంటో మీరే చదవండి.. టిటిడి బంగారం డిపాజిట్ల‌పై వివరణ.. టిటిడి ఒకటిన్నర దశాబ్దానికి పైగా బంగారాన్ని గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా ప్రభుత్వరంగ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తోంది.
 
2015లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన 2.5% వడ్డీ ప్రకారం దీర్ఘకాలిక ప్రాతిపదికగానే బంగారాన్ని ఉంచాలని టిటిడి ధర్మకర్తల మండలి తీర్మానించింది. అయితే, గోల్డ్ మానిటైజేషన్ స్కీంలో ఎక్కువ మొత్తంలో బంగారం డిపాజిట్లను స్వీకరించే బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధానమైనది. ఇప్పటికి కూడా దీర్ఘకాల ప్రాతిపదికన పెద్ద మొత్తంలో బంగారం డిపాజిట్లను స్వీకరించేందుకు చాలా బ్యాంకులు ముందుకు రావడం లేదు.
 
ప్ర‌భుత్వ‌రంగ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోనే మొద‌టి స్థానంలో ఉంద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఇలాంటి స్టేట్ బ్యాంకులో టిటిడి ద‌శాబ్ద కాలానికి పైగా బంగారం డిపాజిట్లు చేస్తోంది. ఈ బ్యాంకులో దాదాపు 7,800 కిలోల బంగారం డిపాజిట్లు ఉంచ‌డం అన్న‌ది స్టేట్ బ్యాంకుతో టిటిడికి ఉన్న దీర్ఘ‌కాలిక బ్యాంకు లావాదేవీల అనుబంధాన్ని తెలియ‌జేస్తోంది. ఈ 7,800 కిలోల బంగారం డిపాజిట్లను స్టేట్ బ్యాంకులో 2017 నుండి 4,470 కిలోలు, 2018 నుండి 920 కిలోలు, 2019 నుండి 1,380 కిలోలు, అదేవిధంగా 2020 నుండి మిగిలిన మొత్తం బంగారాన్ని డిపాజిట్లుగా పెట్ట‌డం జ‌రిగింది.
 
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బంగారం డిపాజిట్ చేయడం వెనుక ఎలాంటి రహస్య అజెండా లేదు. దీర్ఘకాల ప్రాతిపదికన బంగారం డిపాజిట్లు స్వీకరించేందుకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అంగీకరించలేదు. దీనితో పాటు  ఉన్న బంగారాన్ని వెనక్కి తీసుకోవాలని మరియు 6  నెలల సమయం కావాలని టిటిడిని కోరింది.
 
ఈ 6 నెలల కాలానికి గాను దీర్ఘకాలిక గోల్డ్ డిపాజిట్ స్కీమ్‌ కింద ఇతర బ్యాంకులు ఇస్తున్న 2.5% వడ్డీని తాము కూడా 6 నెలలకు చెల్లిస్తామని సదరు బ్యాంకు తెలియజేసింది. ఇలాంటి పరిస్థితుల్లో బోర్డు నిర్ణయించిన మేరకు దీర్ఘకాలిక ప్రాతిపదికగా టిటిడి బంగారాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేయడం జరిగింది. కానీ ప్రస్తుతం ఇదే పెద్ద దుమారాన్ని రేపుతోంది.