సీఎం ప్లాన్ సూపర్... ఆచరణలో సుజనా ఫ్లాప్... పాపం నటనలో వీక్!
విజయవాడ : ప్రత్యేక హోదా వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు మొదటి నుంచి వ్యహాత్మకంగా వ్యవహరిస్తుంటే, కేంద్రమంత్రి సుజనా చౌదరిని ఆఖర్లో స్క్రీన్ ప్లే అంతా చెడగొట్టేశారు. బీజేపీ ఎంపీలతో కలసి బల్లలు చరిచి... బాబు ప్లాన్ని పాడుచేశారు. ప్రత
విజయవాడ : ప్రత్యేక హోదా వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు మొదటి నుంచి వ్యహాత్మకంగా వ్యవహరిస్తుంటే, కేంద్రమంత్రి సుజనా చౌదరిని ఆఖర్లో స్క్రీన్ ప్లే అంతా చెడగొట్టేశారు. బీజేపీ ఎంపీలతో కలసి బల్లలు చరిచి... బాబు ప్లాన్ని పాడుచేశారు. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల్లో సెంటిమెంట్గా మారిందని గ్రహించిన సీఎం చంద్రబాబు మొదటి నుంచి ప్లాన్గా దీనిపై రాజకీయం చేస్తూ వచ్చారు. తొలుత ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ బెటర్ అని... అసలు హోదా వల్ల లాభమా? నష్టమా? చర్చ జరగాలని పదేపదే చెపుతూ వచ్చారు.
ఒకదశలో హోదా ఏమీ సంజీవని కాదు... దీనివల్ల వచ్చే కేంద్ర నిధులు తగ్గిపోతాయని ఏపీ ప్రజల నుంచి తప్పుకునే ప్రయత్నం కూడా చేశారు. కానీ, అది ఫలించలేదు. ఈలోగా ప్రత్యేక హోదా ఇస్తారా? చస్తారా? అంటూ హీరో శివాజీతో పాటు కొందరు మేధావులు ఉద్యమాన్ని లేవదీశారు. సోషల్ మీడియాలో హోదాపై కేంద్రంతో దాదాపుగా ప్రచార యుద్ధం ప్రకటించారు. దీనితో బెంబేలు పడిన సీఎం చంద్రబాబు దీనికి చక్కని రాజకీయ వ్యూహాన్నిరచించారు.
హోదాను ఎక్కడా వ్యతిరేకించొద్దు.. హోదా కావాలని బహిరంగంగా మద్దతు పలుకుదాం. వీలైతే బీజేపీపై కొంచెం ఘాటుగా విమర్శలు కూడా చేసుకోవచ్చు. కానీ, ఇదంతా ఆఫ్ ది రికార్డ్ మాత్రమే. ఆన్ రికార్డ్... అంటే, కేంద్రం దృష్టిలో పడేలా ఆన్రికార్డ్లో మాత్రం ఎలాంటి వ్యతిరేక స్టేట్మెంట్స్ హౌస్లో చేయరాదనే వ్యూహం పన్నారు. దీనికి అనుగుణంగానే తెలుగుదేశం ఎంపీలు ప్రొటెస్ట్ చేస్తూ, మీడియాకు ఫోటో ఫోజ్లు ఇచ్చారు. లోపల రాజ్యసభలో మాత్రం కేంద్రమంత్రి సుజనా చౌదరి బీజేపీని, ప్రధాని మోదీని ప్రస్తుతిస్తూ, సుతిమెత్తగా ప్రత్యేక హోదా గురించి ప్రసంగించారు. అప్పుడే దీనిపై ప్రతిపక్షాల్లో విమర్శలు వెల్లువెత్తాయి.
అయితే, సుజనా ఎందుకు అలా ప్రసంగించారో అంటూ, హౌస్ బయట టీడీపీ నాయకులు షో చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళతామన్నట్లు చెప్పుకొచ్చారు. కానీ, ఇదంతా చంద్రబాబు గేమ్ ప్లాన్లో భాగమేనన్న విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. సీఎం సూచనతో టీడీపీ ఎంపీలు అంతా ప్రధాని మోదీని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రత్యేక హోదా కోసం తాము ఢిల్లీ స్థాయిలో గట్టి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు.
సుజనా బల్ల చరచడంతో... చివర్లో చీదేసిన గేమ్ ప్లాన్
ఇప్పటికి అంతా బాగేనే ఉంది... చంద్రబాబు గేమ్ ప్లాన్ ప్రకారమే ప్రత్యేక హోదా ప్రైవేటు బిల్లుపై టీడీపీ ఎంపీలు నెట్టుకొచ్చారు. కానీ ఆఖర్లో ఆర్ధిక కారణాలతో బిల్లును తిప్పికొట్టి... లోక్ సభ స్పీకర్ కోర్టుకు పంపేయడంతో ఒక్కసారిగా బీజేపీ ఎంపీలు ఆనందంతో బల్లలు చరిచారు. వారితోపాటు భాగ్యస్వామ్య పక్షంగా టీడీపీ కేంద్రమంత్రి సుజనా చౌదరి కూడా బల్ల చరిచి, వెంటనే నాలుక కరుచుకున్నారు. దీనితో ఒక్కసారిగా టీడీపీ గేమ్ ప్లాన్ బెడిసి కొట్టినట్లయింది. ప్రత్యేక హోదా విషయంలో సుజనా బిజేపికి అనుకూలంగా వ్యహరిస్తున్నట్టు తెలుగుదేశం వారే అభిప్రాయపడుతున్నా, అయనను ఎటువంటి వివరణ అడిగే ప్రయత్నం టీడీపీ అధిష్ఠానం చేయకపోవడం ఇక్కడ గమనార్హం.