మీరు భోజనం ఎలా చేస్తున్నారు...!
మనశరీరానికి శక్తినిచ్చేది మనం తీసుకునే ఆహారమే. మనం ఆరోగ్యంగా ఉండాలంటే భోజనానికి సంబంధించిన కొన్ని నియమాలను తు.చ.తప్పక పాటించాల్సిందేనంటున్నారు ఆరోగ్యనిపుణులు. ఆ నియమాలు మనకు తెలిసినాకూడా మనం పాటించం. అయినా వాటిని ఒకసారి మననం చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఉదయం నిద్రలేవగానే కాలకృత్యాలు తీర్చుకున్న వెంటనే పరకడుపున నీళ్ళు త్రాగాలి. ఆ తర్వాత కాస్త తేలికపాటి వ్యాయామం చేయాలి. శరీర కదలికలనుబట్టి ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఉదయం అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవాలంటున్నారు వైద్యులు. దీంతో శరీరంలో రాత్రిపూట జరిగిన జీర్ణక్రియలో భాగంగా శరీరానికి కావలసిన శక్తి ఉదయం మీరు తీసుకునే అల్పాహారంతో వస్తుందంటున్నారు వైద్యులు. దీంతో నూతనోత్తేజంతో మీరు మీ పనులలో పాల్గొనగలుగుతారు. మధ్యాహ్నం నిర్ణీత వేళకు భోజనం ముగించాలి. ఆహారం తినేటప్పుడు బాగా నమిలి తినాలి. అంతేగాని గబగబా మింగేయకూడదు. ఆహారాన్ని నమిలి తింటే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. అలాగే నోట్లోని లాలాజలం ఆహారంతోకలిసి కడుపులోకి ప్రవేశిస్తుంది. భోజనం తీసుకునేటప్పుడు కడుపునిండుగా భుజించకూడదు. ఎంతగా రుచికరమైనాకూడా, మీకిష్టమైన ఆహార పదార్థాలున్నాకూడా తగినంత ఆహారమే తీసుకోవాలంటున్నారు ఆరోగ్యనిపుణులు. అందునా 3/4వ వంతు ఆహారం మాత్రమే తీసుకోవాలంటున్నారు వైద్యులు. మిగిలి భాగం ఖాళీగా ఉంచాలి. సహజంగా చాలామంది ఆకలి వేసినప్పుడు నీళ్ళు ఎక్కువగా తాగుతుంటారు. ఆలా చేయడం ఆరోగ్యానికి ఏమంత మంచిదికాదు. అలాగే మరికొంతమంది దప్పిక వేసినప్పుడు భోజనం చేస్తుంటారు. ఇదికూడా విపరీత ధోరణులకు దారితీస్తుందంటున్నారు వైద్యులు. మీరు భోజనం చేసేటప్పుడు నీళ్ళు తాగాలనిపిస్తే కాసింత నీళ్ళు మాత్రమే త్రాగండి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే ముఖ్యంగా భోజనానికి అరగంట ముందు అలాగే భోజనం అయిన తర్వాత అరగంట వరకు నీళ్ళు త్రాగకూడదంటున్నారు ఆరోగ్యనిపుణులు. ఎందుకంటే భోజనానికి ముందు మీ కడుపులో లాలాజలం,ఎంజైములు చేరివుంటుంది. ఇవి జీర్ణక్రియలో బాగా తోడ్పడుతాయి.
భోజనం చేసినప్పుడు ఈ లాలాజలం, ఎంజైములు ఆహారంతోబాటు కలిసి జీర్ణక్రియలో తోడ్పడుతాయి. భోజనం చేసిన అరగంట తర్వాత నీళ్ళనుత్రాగితే జీర్ణమయిన ఆహారం పూర్తిగా నీటితో కలిసి అందులోనున్న పోషక విలువలు శరీరానికి చేరుతాయి. మిగిలిన వ్యర్థపదార్థాలు ఈ నీటిద్వారా బయటకు వచ్చేస్తాయంటున్నారు ఆరోగ్యనిపుణులు. అలాగే శరీరం ఆరోగ్యంగాకూడా ఉంటుందంటున్నారు వైద్యులు.మీకు ఎన్ని పనులు ఉన్నాకూడా వాటిని పక్కన పెట్టి సమయానుసారం అహారాన్ని భుజించండి. ఆ తర్వాతే మీ కార్యక్రమాలను ముగించుకోండి. పాచిపోయిన అన్నం లేదా ఇతర ఆహార పదార్థాలను మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ ఆహారంగా తీసుకోకండి. అలాగే రెండవసారి వేడిచేసిన ఆహార పదార్థాలనుకూడా భుజించకండి. మీరు తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణమయ్యాకే మరోసారి ఆహారాన్ని తీసుకోండి. అంతేగాని సమయం అయ్యిందికదా అని ఆకలి వేయకున్నాకూడా భోజనాన్ని తీసుకోకండి. రాత్రిపూట ఆకలి వేయకపోతే కేవలం పండ్లు మాత్రం తిని పడుకోండి. దీంతో మీ జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుందంటున్నారు వైద్యులు. ప్రస్తుతం ఉరుకులు పరుగుల జీవితగమనంలో విశ్రాంతి తీసుకునేందుకు సమయం చాలడం లేదు. దీంతో భోజనం తిన్నవెంటనే నిద్రకుపక్రమిస్తుంటారు చాలామంది. ఇలా చేయడం ఆరోగ్యానికి ఏమంత మంచిదికాదంటున్నారు వైద్యులు. కాసేపు నడక సాగించండి. లేదా పిచ్చాపాటిగా మాట్లాడుతూ...ఇంటి ఆరుబయట తిరుగాడండి. ఆలా తిరిగిన తర్వాత నిద్రకుపక్రమించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా రాత్రిపూట భోజనం ముగించినవెంటనే కోపతాపాలకు తావివ్వకండి. దీంతో శరీరంలో ఒత్తిడి పెరిగి అనారోగ్యానికి మూల కారణమవుతుందని సూచిస్తున్నారు వైద్యులు.భోజనానికి ముందుగా అరటిపండుగాని లేదా కీరకాయను మాత్రం ఎలాంటి పరిస్థితులలోనూ తినకూడదు. భోజనంలో పాలు, పెరుగు, మజ్జిగ ఉండేలా చూసుకోండి. దీంతో నిత్యం ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్యనిపుణులు చెపుతున్నారు. వీలైతే రాత్రి భోజనం ముగించిన తర్వాత పడుకునే ముందు గోరువెచ్చని పాలను త్రాగండి. దీంతో శుఖవంతమైన నిద్రతోబాటు ఆరోగ్యానికికూడా చాలామంచిదంటున్నారు వైద్యులు.