బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : బుధవారం, 7 నవంబరు 2018 (10:05 IST)

తిండి మానెయ్యద్దు... అలాగని ఎక్కువ తినొద్దు... ఇదే అత్యుత్తమ జీవన సూత్రం...

కడుపు నిండా తిండి.. కంటి నిండా నిద్రా.. మనిషికి ఈ రెండు చాలంటారు. కానీ ఆధునిక జీవనశైలిలో మనిషి కంటికి కనుకు కరవవుతోంది. అలాగే, మంచి పోషకాలు కలిగిన ఆహారం కూడా లభించడం లేదు. పైగా, తినటానికి సమయం లేకపోవటం.. మరోవైపు తినటానికి రకరకాల కొవ్వులు, స్వీట్లతో చేసిన పదార్ధాలు అందుబాటులో ఉండటం.. ఈ రెండూ ఇక్కట్లు తెచ్చిపెట్టేవే. అంతేకాకుండా ఒక్క పూట పస్తుండి.. మరోపూట అతిగా లాగిచ్చేస్తున్నారు. ఈ పరిస్థితి వల్ల అనేక అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. 
 
ముఖ్యంగా, చాలామంది కంచం ముందు కూర్చుంటే కడుపు నిండిపోయే వరకూ కూడా ఆగలేరు. జిహ్వ చాపల్యంతో ఇలా పొట్ట నింపెయ్యటం కాదు.. భోజనం మొత్తం ముగించిన తర్వాత కూడా కడుపులో మరో నాలుగైదు ముద్దలకు చోటుండాలన్నది మన పెద్దల మాట. ఈ మాటలు అక్షర సత్యాలని ఇప్పుడు ఆధునిక పరిశోధనలు నిర్ధారిస్తున్నాయి. కడుపు నిండా కాకుండా.. నాలుగు ముద్దలు తక్కువ తినేవారి ఆయుర్దాయం ఎక్కువగా ఉంటోందని, జీవిత చరమాంకంలో కూడా వీరికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలేమీ ఉండటం లేదని పరిశోధకులు గుర్తించారు. 
 
స్వీట్లు, కొవ్వు, తీపి పదార్ధాల వంటి క్యాలరీలు ఎక్కువగా ఉండే పదార్ధాలు బాగా తగ్గించేసి.. చిన్నతనం నుంచీ పీచుతో సహా చక్కటి పోషకాలుండే పండ్లు, కూరగాయల వంటివి మితంగా తీసుకుంటుండేవారు ఎక్కువ కాలం జీవిస్తున్నారనీ, ముఖ్యంగా వీరిలో మతిమరుపు, మధుమేహం, క్యాన్సర్ల వంటి జబ్బులు చాలా తక్కువగా ఉంటున్నాయని పరిశోధకులు గుర్తించారు. కాబట్టి తిండి మానెయ్యద్దు... అలాగని ఎక్కువ తినొద్దు. సాధ్యమైనంత మితంగా తినటం, ఆ తినేదానిలో కూడా సాధ్యమైనంత చక్కటి పోషకాహారం ఉండేలా చూసుకోవటం.. అత్యుత్తమ జీవన సూత్రం.