ఆదివారం, 12 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ప్లీజ్... మా పరువు తీయకండి... పాకిస్థాన్‌కు అమెరికా వార్నింగ్

whitehouse
పాకిస్థాన్‌కు అగ్రరాజ్యం అమెరికా గట్టి వార్నింగ్ ఇచ్చింది. అబద్ధపు ప్రచారాలతో మీ పరువుతోపాటు మా పరువు తీయొద్దంటూ హితవు పలికింది. పదేపదే తప్పుడు ప్రచారాలు చేస్తూ పరువు తీసుకోవద్దని కోరింది. 
 
ఇలా హితబోధ చేయడానికి కారణం లేకపోలేదు. అగ్రరాజ్యం అమెరికా నుంచి అత్యాధునిక మిస్సైల్స్ ఏఐఎం-120 తమకు అందజేస్తోందంటూ ప్రచారం చేసింది. వీటిని నిజమని నమ్మిన పాకిస్థాన్ మీడియా పలు రకాలైన వార్తా కథనాలను వండివార్చింది. ఈ విషయం అమెరికా రక్షణ శాఖ చెవిన పడింది. దీంతో వివరణ ఇచ్చింది.
 
పాకిస్థాన్‌కు కొత్తగా ఎలాంటి మిసైల్స్ ఇవ్వడంలేదని పేర్కొంది. 2007లో 700 ఎఫ్-16 యుద్ధ విమానాల అమ్మకం సందర్భంగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు విడి భాగాలను సరఫరా చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే అందజేసిన ఎఫ్-16 విమానాలకు సంబంధించిన సాంకేతిక సపోర్ట్, విడి భాగాలను మాత్రమే పంపిస్తున్నట్లు తెలిపింది. 
 
ఈ అంశాలను తప్పుగా అర్థం చేసుకున్న పాక్ మీడియా అవాస్తవమైన సమాచారం, అంశాలతో కథనాలు ప్రచురించిందని భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం వివరణ ఇచ్చింది. గతంలోనూ పాకిస్తాన్ అనేక అంశాలపై తప్పుడు ప్రచార చేసి నవ్వులపాలైన విషయం తెల్సిందే.