1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 మే 2025 (10:16 IST)

మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కనుసన్నల్లోనే పహల్గాం ఉగ్రదాడి : పంజాబ్ మంత్రి!!

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడి పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కనుసన్నల్లో జరిగిందని పంజాబ్ ప్రావీన్స్ సమాచార శాఖామంత్రి అజ్మా బుఖారీ సంచలన ఆరోపణలు చేశారు. ఆమె అధికార పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీకి చెందిన సీనియర్ మహిళా నేత కావడం గమనార్హం. ప్రస్తుత పాక్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ సోదరుడు, మూడు పర్యాయాలు ప్రధానిగా పనిచేసిన నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని ఈ ఆపరేషన్‌ జరిగిందని ఆమె స్పష్టంచేశారు. 
 
నవాజ్ షరీఫ్ సాధారణ నాయకుడు కాదు. ఆయన చేసిన పనే ఆయన గురించి చెబుతుంది అని అజ్మా బుఖారీ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌ను అణు శక్తిగా మార్చింది నవాజ్ షరీఫే. ఇపుడు భారత్‌పై జరిగిన ఆపరేషన్‌కు కూడా ఆయనే రూపకల్పన చేశారు అని ఆమె ఆరోపించారు. కాగా, ఏప్రిల్ 22వ తేదీన జమ్మూకాశ్మీర్‌‍లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా మే 7వ తేదీ తెల్లవారుజామున భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించింది. 
 
ఆ తర్వాత మే 8, 9, 10 తేదీల్లో పాకిస్థాన్.. భారత సైనిక స్థావరాలపై దాడికి ప్రయత్నించి పూర్తిగా విఫలమైంది. నాలుగు రోజుల పాటు కొనసాగిన తీవ్ర సరిహద్దు ఉద్రిక్తతల అనంతరం శనివారం నాడు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను చల్లార్చేందుకు కాల్పుల విరమణపై ఒక అవగాహన కుదిరింది.