1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 సెప్టెంబరు 2023 (16:42 IST)

కరోనాకు చికిత్స తీసుకున్న చిన్నారికి నీలి రంగులో మారిపోయిన కళ్ళు

babu blue eye
కరోనా మహమ్మారి అనేక మంది జీవితాలను విచ్ఛిన్నం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను హరించిన ఈ వైరస్... ఇపుడు పోస్ట్ కరోనా వ్యాధుల పేరుతో ప్రజలను భయపెడుతుంది. కరోనా కోసం చికిత్స తీసుకున్న అనేక మంది బాధితులు వివిధ రకాలైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. తాజాగా కరోనాకు చికిత్స తీసుకున్న ఓ ఆరు నెలల చిన్నారి కళ్లు నీలి రంగులోకి మారిపోయాయి. ఈ ఘటన థాయ్‌లాండ్‌లో వెలుగు చూసింది. ఈ అసాధారణ ఘటనకు సంబంధించిన వివరాలు ఫ్రాంటియర్స్ ఇన్ పీడియాట్రిక్స్ జర్నల్‌తో తాజాగా ప్రచురితమయ్యాయి.
 
ఓ రోజున చిన్నారికి జ్వరం, దగ్గూ రావడంతో కొవిడ్ టెస్ట్ చేయించగా పాజిటివ్ అని తేలింది. దీంతో, వైద్యులు చిన్నారికి ఫెవిపిరావిర్ టాబ్లెట్స్ వాడాలని సూచించారు. మందు వాడటం మొదలెట్టిన తర్వాత చిన్నారి ఆరోగ్యం మెరుగైంది. అయితే, తొలి డోసు వేసుకున్న 18 గంటల తర్వాత శిశువు కళ్లు నీలి రంగులోకి మారిన విషయాన్ని గమనించిన తల్లి వైద్యులకు తెలియజేసింది. 
 
దీంతో, ఫెవిపిరావిర్ మందు వినియోగం తక్షణం నిలిపివేయమని వైద్యులు సూచించారు. ఆ తర్వాత మరో ఐదు రోజులకు బిడ్డ కళ్లు సాధారణ స్థితికి చేరుకున్నాయి. 'కళ్లు మినహా చర్మం, గోళ్లు, నోరు, ముక్కు వంటి ప్రాంతాల్లో ఎటువంటి రంగు మార్పు కనిపించలేదు. ఫెవిపిరావిర్ వినియోగం మొదలెట్టిన మూడో రోజుకు శిశువు ఆరోగ్యం మెరుగుపడింది. అయితే, కళ్ల రంగు మార్పు కారణంగా ఆ మందు వాడొద్దని వైద్యులు సూచించారు. మందు నిలిపివేసిన ఐదో రోజుకు కళ్లు మళ్లీ సాధారణ స్థితికి వచ్చాయి' అని జర్నల్లో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.