మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By కుమార్ దళవాయి
Last Modified: సోమవారం, 29 ఏప్రియల్ 2019 (20:40 IST)

తొమ్మిది నెలల చిన్నారి కోసం చట్టాన్ని పక్కన పెట్టిన యూఏఈ ప్రభుత్వం

యూఏఈ చరిత్రలో మొట్టమొదటి సారి హిందూ తండ్రి, ముస్లిం తల్లికి పుట్టిన పాపకు ఆ దేశ ప్రభుత్వం జనన ధృవీకరణ పత్రం ఇచ్చింది. యూఏఈ చట్టం ప్రకారం ముస్లిం అబ్బాయి వేరే మతానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు కాని ముస్లిం అమ్మాయి వేరే మతానికి చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకోకూడదు. ఒకవేళ అలా చేసుకున్నప్పుడు వారికి పుట్టే బిడ్డలకు యూఏఈ ప్రభుత్వం నుంచి జనన ధృవీకరణ పత్రం జారీ చేయరు. అయితే, ఆ దేశం 2019వ ఏడాదిని ‘సహన సంవత్సరాది’గా ప్రకటించడంతో నిబంధనలను పక్కకు పెట్టి ఓ పాపకు జనన ధ్రువీకరణ పత్రం ఇచ్చింది.
 
కేరళకు చెందిన కిరణ్ (హిందూ), సనమ్ సబు సిద్ధిఖ్ (ముస్లిం) 2016లో పెళ్లి చేసుకుని అబూధాబీలో నివసిస్తున్నారు. జులై, 2018లో వారికి పండంటి ఆడపిల్ల పుట్టింది. వారి వివాహం యూఏఈ నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో వారు కష్టాలు పడ్డారు. దీంతో కిరణ్ నో అబ్జక్షన్ లెటర్ కోసం కోర్టులో కేసు వేయగా.. నాలుగు నెలల తరువాత కోర్టు ఆ కేసును కొట్టేసింది. ఇండియన్ ఎంబసీ అంబాసడర్ రాజమురుగన్ సహాయంతో కిరణ్ న్యాయ విభాగాన్ని కలిశాడు. 
 
ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు మొదటగా చీఫ్ జస్టిస్‌కు రిక్వెస్ట్ లెటర్ పెట్టుకోవాలని.. చీఫ్ జస్టిస్ అంగీకారం తెలిపిన లెటర్‌ను హెల్త్ అథారిటీకి అందిస్తే సర్టిఫికెట్ జారీ చేస్తారని న్యాయవిభాగం సూచించింది. న్యాయవిభాగం తెలిపిన విధంగా చేయగా.. కిరణ్, సనమ్ దంపతులకు జన్మించిన అనామ్తా ఏసెల్లెన్ కిరణ అనే పాపకు నిబంధలను పక్కనపెట్టి మొదటిసారిగా ఏప్రిల్ 14న యూఏఈ ప్రభుత్వం జనన ధృవీకరణ పత్రాన్ని ఇచ్చింది.