బ్రిటన్ హిస్టారికల్ డైవర్స్... బ్రెగ్జిట్ ఫలితాలతో లండన్లో సంబురాలు.. కామెరాన్ రిజైన్కు డిమాండ్
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలా వద్దా అనే అంశపై నిర్వహించిన ఎన్నికల పోలింగ్ ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో 52 శాతం మంది బ్రిటన్ పౌరులు ఈయు నుంచి బ్రిటన్ వైదొలగాలని కోరుతూ ఓటు వేశారు. దీంతో బ్రిటన్ వ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి.
నిజానికి యూరోపియన్ ఎకానామిక్ కమిటీలో బ్రిటన్ 1973లో భాగస్వామ్య దేశంగా చేరింది. ఆ తర్వాత ఈయూ ఏర్పాటులో కీలక పాత్ర వహించింది. ఇప్పుడు 40 యేళ్ళ తర్వాత అందులో నుంచి వైదొలగాలని ఆ దేశ ప్రజలు తీర్పునిచ్చారు. దీన్ని బ్రిటన్ పౌరులు హిస్టారికల్ డైవర్స్గా అభివర్ణిస్తున్నారు. బ్రెగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడిన వెంటనే బ్రిటన్ వ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి.
కొందరైతే ఈ ఫలితాలు వెల్లడైన వెంటనే దేశానికే స్వాతంత్య్ర వచ్చిందన్న సంతోషంలో నినాదాలు చేశారు. అదేసమయంలో ఈయూలో బ్రిటన్ కొనసాగాలని వాదిస్తూ, ప్రచారం చేసిన ప్రధాని డేవిడ్ కామెరూన్ రాజీనామా చేయాలని కొందరు డిమాండ్ చేశారు. ఈ నిర్ణయంతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ముఖ్యంగా బ్రిటిష్ పౌండ్ విలువ 5 శాతం మేరకు పడిపోయింది.
ఉత్కంఠ భరితంగా సాగిన బ్రెగ్జిట్ ఓటింగ్లో 72 శాతం మంది పాల్గొన్నారు. దాదాపు అన్ని చోట్ల కౌంటింగ్ ముగిసేసరికి ఈయూ నుంచి విడిపోయేందుకు 52 శాతం మంది ఓట్లు వేసినట్లు తేలింది. ఈయూలోనే కొనసాగాలని 48 శాతం మంది ఓటు వేశారు.
మరోవైపు.. బ్రెగ్జిట్ ఎన్నికల్లో భారీ రిగ్గింగ్ జరిగినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. పోలింగ్ స్టేషన్కు వచ్చిన కొందరికి ఓ మహిళ, మరికొందరు పెన్నులు ఇవ్వడంతో అనుమానం వచ్చిన కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.