1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 29 డిశెంబరు 2022 (09:33 IST)

ప్రభావం చూపని చైనా డ్రగ్స్... భారత్ మందుల కోసం ఎదురు చూపు

generic medicine
డ్రాగన్ కంట్రీ చైనాలో కరోనా వైరస్ విస్ఫోటనం కొనసాగుతోంది. ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. పైగా చైనా పాలకులు అమలు చేసిన జీరో కోవిడ్ విధానం వికటించింది. ఫలితంగా చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి ఒక్కసారిగా ప్రబలి పోయింది. అదేసమయంలో కరోనా వైరస్ నుంచి కోలుకునేందుకు చైనా వైద్య నిపుణులు తయారు చేసిన మెడిసిన్ ఏమాత్రం పని చేయడం లేదు. దీంతో భారత్ మందుల కోసం ఎదురు చూస్తున్నారు. దీనికితోడు యాంటీ డ్రగ్స్ కొరత వేధిస్తుంది. 
 
ఈ నేపథ్యంలో భారత్‌ జనరిక్‌ ఔషధాలకు చైనా బ్లాక్‌మార్కెట్‌లో విపరీతంగా డిమాండు పెరిగింది. ప్రిమోవిర్‌, పాక్సిస్టా, మోల్నుట్‌, మోల్నాట్రిస్‌.. తదితర మందులను కొనుగోలు చేసేందుకు చైనీయులు డార్క్‌వెబ్‌, ఇతర ఆన్‌లైన్‌ మాధ్యమాలను ఆశ్రయిస్తున్నారు. 
 
ఫైజర్‌కు చెందిన పాక్స్‌లోవిడ్‌, చైనా ఫార్మా సంస్థ తయారు చేసిన అజువుడిన్‌ లాంటి యాంటీ వైరల్‌ డ్రగ్స్‌ చైనాకు అందుబాటులో ఉన్నా.. అవి కొన్ని ఆస్పత్రుల్లోనే లభ్యమవుతున్నాయి. నిజానికి భారత ఔషధాలకు చైనా ప్రభుత్వ అనుమతి లేదు. అయినా ప్రాణాలు రక్షించుకొనేందుకు చైనీయులు రకరకాల మార్గాల్లో వీటిని కొనుగోలు చేస్తున్నారు.