1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 డిశెంబరు 2022 (13:52 IST)

తెలంగాణాలో బూస్టర్ డోసులకు ఒక్కసారిగా పెరిగిన డిమాండ్

booster dose
చైనా, అమెరికా, బ్రెజిల్ తదితర దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తంగా శరవేగంగా వ్యాపిస్తుంది. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. అదేసమయంలో ప్రజలు కూడా అలెర్ట్‌గా ఉన్నారు. కరోనా వ్యాక్సిన్ రెండు, బూస్టర్ డోసులు వేయించుకోనివారు ఇపుడు ఆ టీకాలను వేయించుకునేందుకు క్యూ కడుతున్నారు. 
 
దీంతో తెలంగాణాలో బూస్టర్ డోసులతో పాటు కరోనా టీకాలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. క్రిస్మస్ రోజున సైతం ఈ టీకాల కోసం ప్రజలు భారీగా సంఖ్యలో బారులు తీరారు. దీనికి కారణం కేంద్ర జారీ చేసిన ముందస్తు హెచ్చరికలే కావడం గమనార్హం. దీంతో ఎందుకైనా మంచిదని బూస్టర్ డోసు కోవిడ్ టీకాలను వేయించుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. 
 
గడిచిన 72 గంటల్లో బూస్టర్ డోస్‌ వేయించుకునేందుకు వచ్చే వారి సంఖ్య అంతకుముందు రోజువారీ సగటుతో పోల్చితే ఏకంగా 400 శాతం పెరిగినట్టు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 21వ తేదీన 646 మంది బూస్టర్ డోసులు వేయించుకోగా, 22న 1631 మంది, 23న 2267 మంది 24న 3380, 25న 1500 మంది చొప్పున ఈ టీకాలు వేయించుకున్నారు. కేంద్రం హెచ్చరికలకు ముందు ఈ బూస్టర్ డోసులు వేయించుకునేవారి సంఖ్య ప్రతి రోజూ వందల్లో ఉంటే ఇపుడు ఈ సంఖ్య వేలల్లోకి చేరిందని తెలిపారు.