గురువారం, 4 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (13:59 IST)

సూడాన్‌లో ప్రతి ఒక్క భారతీయ పౌరుడిని సురక్షితంగా తీసుకొస్తాం : కేంద్రం

sudan coup
ఘర్షణలు, అల్లర్లతో అట్టుడికిపోతున్న సూడాన్‌లోని ప్రతి ఒక్క భారతీయుడుని క్షేమంగా, సురక్షితంగా స్వదేశానికి తీసుకొస్తామని భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా హామీ ఇచ్చారు.

పైగా, ప్రస్తుతం సూడాన్‌లో దారుణమైన పరిస్థితులు నెలకొనివున్నాయని తెలిపారు. ఎపుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితులు నెలకొనివున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల చిట్ట చివరి భారతీయ పౌరుడిని కూడా సురక్షితంగా స్వదేశానికి చేరుస్తామని ఆయన స్పష్టం చేశారు.
 
కాగా, సూడాన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఆపరేషన్ కావేరిని ప్రారభించింది. ఇందులోభాగంగా, ఇప్పటికే రెండు వేల మంది వరకు పౌరులను తీసుకొచ్చింది. 
 
ఈ ఆపరేషన్‌పై వినయ్ క్వాత్రా ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ, దాదాపు 1700 నుంచి 2000 మంది భారతీయులను ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి సరిహద్దు ప్రాంతాల్లోని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. 
అందులో కొంతమంది స్వదేశానికి కూడా చేరుకున్నట్లు తెలిపారు. 
 
ఆపరేషన్‌ కావేరిలో భాగంగా రెండో విడతగా గురువారం 246 మంది భారతీయులు ఎయిర్‌ఫోర్స్‌ విమానం ద్వారా ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకున్నట్లు ఆయన వివరించారు. అంతకుముందు ఓ కమర్షియల్‌ విమానంలో 360 మంది సురక్షితంగా ఢిల్లీకి వచ్చినట్లు ఆయన చెప్పారు.
 
సూడాన్‌ నుంచి మొత్తం ఇప్పటివరకు 606 మంది భారత్‌కు చేరుకున్నట్లు క్వాత్రా చెప్పారు. సూడాన్‌లో ఘర్షణలకు కారణమైన ఆర్మీ, ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ (ఆర్‌ఎస్‌ఎఫ్‌) జనరల్స్‌తో భారత్‌ టచ్‌లో ఉన్నట్లు ఆయన తెలిపారు. భారతీయులను అక్కడి నుంచి తరలించడంపై ఇరు వర్గాలు సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. సూడాన్‌లో దాదాపు 3,100 మంది భారతీయులు అక్కడి దౌత్య కార్యాలయంలో రిజిస్టర్‌ చేసుకున్నట్లు చెప్పారు. 
 
వీరితోపాటు 900 నుంచి 1000 మంది భారత్‌ మూలాలున్న వారు కూడా సూడాన్‌లో ఉన్నట్లు చెప్పిన క్వాత్రా... ఒక వేళ అభ్యర్థిస్తే వారిని కూడా భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. ఆపరేషన్‌ కావేరీ విషయంలో సాయం చేస్తున్న సౌదీ అరేబియాను ఆయన అభినందించారు.