ఆదివారం, 16 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (05:41 IST)

ట్రంప్ ఒకదారిలో వెళితే భారతీయులు మరో దారి చూసుకుంటారు. భయమెందుకు?

హెచ్1 B వీసాలను అడ్డుకోవాలని, భారతీయ వలసదార్లను నిరోధించాలని ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శతవిధాల ప్రయత్నిస్తుంటే.. నువ్వొక రూట్లో వస్తే మేం ఇంకో రూట్లో పోతాం అని ప్రవాస భారతీయులు చెప్పడం కాదు చేసి చూపుతున్నారు.

పిల్లిని నాలుగు గోడల మధ్య బంధించి కొట్టబోతే  అమాంతం తిరగబడుతుందని సామెత. దాన్ని ఇప్పుడు కాస్త మార్చి చెబితే ట్రంప్‌ది ఒకదారయితే, ఎన్నారైలది మరొక దారి అవుతుంది.  హెచ్1 B వీసాలను అడ్డుకోవాలని, భారతీయ వలసదార్లను నిరోధించాలని ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శతవిధాల ప్రయత్నిస్తుంటే.. నువ్వొక రూట్లో వస్తే మేం ఇంకో రూట్లో పోతాం అని ప్రవాస భారతీయులు చెప్పడం కాదు చేసి చూపుతున్నారు. 
 
హెచ్‌1బీ వీసాల మీద ట్రంపు కత్తి గట్టడంతో.. గ్రీన్‌కార్డు కోసం భారతీయులు రకరకాల మార్గాలు వెతుకుతున్నారు. బాగా డబ్బున్న వారు ఈబీ-5 పథకంపై దృష్టి సారిస్తున్నారు. ఈబీ-5 అంటే.. ఇమ్మిగ్రెంట్‌ ఇన్వెస్టర్‌ ప్రోగ్రామ్‌. ఈ పథకం కింద అమెరికాలో పెట్టుబడులు పెట్టేవారికి, వారి జీవిత భాగస్వామికి, 21 ఏళ్లలోపు పిల్లలకు గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత లభిస్తుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఉద్యోగాల కల్పన ద్వారా ఊతమిచ్చేందుకు 1990లో అప్పటి ప్రభుత్వం 1990లో ఈబీ-5కి రూపకల్పన చేసింది. ఈబీ-5 కాలపరిమితి ఏప్రిల్‌లో ముగియనుంది. 
 
తర్వాత దీని కింద పెట్టుబడిని 1.35 మిలియన్‌ డాలర్లకు(రూ.7 కోట్లకు) పెంచాలని అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్‌ విభాగం ప్రతిపాదించింది.దాంతో చాలామంది ఇప్పుడే ఈబీ-5 ద్వారా గ్రీన్‌కార్డులకు దరఖాస్తు చేసేందుకు తొందరపడుతున్నారు. ఈబీ-5లో రెండు మార్గాలున్నాయి. 1) కనీసం 10 లక్షల డాలర్ల(రూ.6.7 కోట్ల)తో సొంతంగా ఏదైనా వ్యాపారం పెట్టి 10 మంది అమెరికన్లకు పూర్తికాల ఉద్యోగం ఇవ్వాలి. 2) ప్రభుత్వం ఆమోదించిన ఈబీ-5 వ్యాపారాల్లో 5 లక్షల డాలర్లు(రూ.3.4 కోట్లు) పెట్టుబడి పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో 10 కన్నా ఎక్కువ మంది అమెరికన్లకు ఫుల్‌టైమ్‌ జాబ్‌ ఇవ్వాలి. ఇన్నాళ్లూ ఈబీ-5ని పట్టించుకోని భారతీయులు ఇప్పుడు దృష్టి సారించారు. వారానికి ముగ్గురు ఈబీ-5 కింద పెట్టుబడులకు సిద్ధమవుతున్నారు.
 
ఇటీవలి కాలంలో ఈబీ-5 కింద 210 మంది దరఖాస్తు చేయగా అందులో 42 మంది భారతీయులే. వారి నిధులను డంకిన్‌ డోనట్స్‌, ఫోర్‌ సీజన్స్‌ వంటి కంపెనీల్లో పెట్టుబడులు పెడతారు. ఇలా వస్తున్న వారిలో రిలయన్స్‌, ఆదిత్య బిర్లా, మెకిన్సే తదితర కంపెనీల టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లు.. ప్రముఖ వ్యాపార కుటుంబాల వారు ఉన్నారు. పిల్లలు భవిష్యత్తులో అమెరికాలో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఉద్యోగాలు చేయాలనే ఉద్దేశంతో ముందుకొస్తున్నారు. ఈ పథకం కింద వీసాలు పొందుతున్న భారతీయులు ఏటా 30 శాతం పెరుగుతున్నారు.