1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 ఆగస్టు 2021 (11:12 IST)

ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ల రాజ్యం: స్వదేశానికి చేరుకుంటున్న భారతీయులు

ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ల రాజ్యం ప్రారంభమైంది. ఆప్ఘన్ తాలిబన్ల చేతిలోకి వెళ్లిపోయింది. అక్కడి తమ ప్రజలను వెంటనే తీసుకుపోయేందుకు అమెరికా ప్రత్యేక పౌర, యుద్ధ విమానాలను రంగంలోకి దింపింది. అంతేకాదు... రాజధాని కాబూల్‌లో ఎయిర్ ట్రాఫిక్‌ను తన అధీనంలోకి తీసుకుంటోంది. తద్వారా... తమ పౌరులను సురక్షితంగా తీసుకుపోయేలా ప్లాన్ వేసుకుంటోంది.
 
ఆదివారం నుంచి కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు రద్దీగా మారిపోయింది. భారతీయులు సహా అన్ని దేశాల ప్రజలూ... స్వదేశాలకు వెళ్లిపోయేందుకు కాబూల్ ఎయిర్‌పోర్టుకు వస్తున్నారు. రాత్రంతా జనం వస్తూనే ఉన్నారు. అందువల్ల అక్కడ ఎటు చూసినా ప్రయాణికులే కనిపిస్తున్నారు.
 
భారత ప్రభుత్వం ఓ విమానాన్ని సిద్ధంగా ఉంచింది. అందులో భారతీయుల్ని సురక్షితంగా ఇండియా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అమెరికా గనుక ఎయిర్ ట్రాఫిక్‌ని తన కంట్రోల్‌‌లోకి తెచ్చుకుంటే అప్పుడు అమెరికాతో మాట్లాడుకొని ఇండియా తన విమానాన్ని నడపాల్సి ఉంటుంది.
 
అమెరికా సంపన్న దేశం కావడంతో... తమ పౌరుల్ని తరలించే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. 6వేల మంది సైన్యాన్ని రక్షణగా పెట్టుకుంది. అమెరికా వేల మంది తమ పౌరుల్ని తరలించనుంది. వారిలో చాలామంది... అమెరికా ఇదివరకు చేయదలచిన యుద్ధంలో సేవలు అందించేందుకు ఆప్ఘన్ వచ్చినవారే. వారంతా ఇప్పుడు అమెరికా వెళ్లిపోతున్నారు.
 
చాలా దేశాలు ఇప్పుడు తమ తమ పౌరులను తరలించే పనిలో ఉన్నాయి. భారత్ విషయానికి వస్తే.. ఆదివారం ఎయిర్ ఇండియా విమానంలో ఆప్ఘనిస్థాన్ నుంచి 129 మంది ప్రయాణికులు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. సోమవారం మరో విమానం అక్కడి నుంచి ఉదయం సమయంలోనే బయలుదేరుతుంది. కొన్ని రోజుల ముందు నుంచే ఇండియా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది.