శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 ఏప్రియల్ 2020 (13:11 IST)

ఉత్తర కొరియా నిండుకున్న నిల్వలు... ఆకలి కేకలు.. నిజమా?

ఉత్తర కొరియాలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ దుర్భిక్షం కారణంగా ఉత్తర కొరియా వాసులు ఆకలితో అలమటిస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెల్సిందే. ఈయనకు గుండె ఆపరేషన్ చేయడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. 
 
ఈ పరిస్థితుల్లో ఆ దేశ పరిస్థితి చాలా దీనంగా ఉందంటూ మీడియా సంస్థ ఎస్కే న్యూస్ వెల్లడించింది. ఉత్తరకొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో నిత్యావసరాలు కూడా దొరకడం లేదని కథనంలో పేర్కొంది. 
 
ఆహార నిల్వలు నిండుకున్నాయని తెలిపింది. కరోనా కట్టడిలో భాగంగా నిత్యావసరాల కొనుగోళ్లపై ఆంక్షలు విధించి ఉండవచ్చని అభిప్రాయపడింది. కిమ్ జాంగ్ అనారోగ్యానికి గురవుతారనే విషయాన్ని ఊహించి ఉండకపోవచ్చని తెలిపింది.
 
తొలుత కూరగాయలు, ఈ తర్వాత పండ్ల దిగుమతులపై ఉత్తర కొరియా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆ తర్వాత ఇతర నిత్యావసరాల సరకులపై కూడా ఈ ఆంక్షలు పొడిగించింది. ఉత్తరకొరియాలో ఆహార కొరత ఏర్పడటం ఇదే ప్రథమం కాదు. ప్రపంచ పేద దేశాల్లో ఒకటైన ఉత్తరకొరియాలో ఆహార పదార్థాల కొరత సర్వసాధారణం. గతంలో కూడా ఇదే పరిస్థితి నెలకొని వేలాది మంది చనిపోయారు. 
 
మరోవైపు, కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యం పూర్తిగా విషమించిందనే కథనాలు వినిపిస్తున్నాయి. ఆయన కోమాలోకి వెళ్లిపోయారని చెబుతున్నారు. అయితే ఉత్తరకొరియా మాత్రం దీనిపై ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఉత్తరకొరియా మీడియా సైతం దీనిపై మౌనంగా ఉంది.