1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 జూన్ 2022 (13:49 IST)

టీ తాగడం తగ్గించండి.. ప్రజలను విజ్ఞప్తి చేస్తోన్న పాకిస్థాన్

Tea
Tea
టీ తాగడం చాలామందికి అలవాటు.  ఎండాకాలం అయినా ఇంకా చలికాలం అయినా కొందరు వ్యక్తులు టీ తాగకుండా జీవించలేరు. అయితే టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై అది చాలా చెడు ప్రభావం చూపిస్తుంది. టీ ఎక్కువగా తాగడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.
 
టీలో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల అసలు నిద్ర పట్టదు. టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల నిద్ర లేమీ ఏర్పడుతుంది. దీని వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు, మానసిక ఒత్తిడి ఇంకా అలాగే ఆందోళన వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.  అందుకేనేమో పాకిస్థాన్ ప్రజలను టీ తాగడం తగ్గించండని విజ్ఞప్తి చేస్తోంది. 
 
జనం రోజూ తాగే టీ కప్పుల సంఖ్యను తగ్గించుకుంటే.. పాకిస్తాన్ భారీ దిగుమతుల ఖర్చులు తగ్గుతాయని సీనియర్ మంత్రి అహసాన్ ఇక్బాల్ పేర్కొన్నారు.
 
పాక్ విదేశీ మారక ద్రవ్యం నిల్వలు గణనీయంగా పడిపోయాయి. ప్రస్తుతం రెండు నెలల దిగుమతులకు చెల్లించగల నిల్వలే ఉన్నాయి. దీంతో దేశానికి నిధులు అత్యవసరమయ్యాయి.
 
ప్రపంచంలో తేయాకును మరే దేశంకన్నా అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం పాకిస్తాన్. గత ఏడాది 60 కోట్ల డాలర్ల కన్నా ఎక్కువ విలువైన టీని పాక్ దిగుమతి చేసుకుంది.
 
''దేశ ప్రజలంతా రోజుకు ఒకటి, రెండు కప్పులు టీ తాగటం తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. ఎందుకంటే మనం అప్పు మీద టీని దిగుమతి చేసుకుంటున్నాం'' అని మంత్రి ఇక్బాల్ కోరినట్లు పాకిస్తాన్ మీడియా తెలిపింది. 
 
అయితే ప్రభుత్వ చర్యల వల్లే ధరలు పెరిగాయని, పెరిగిన ధరలను తగ్గించకుండా టీ తాగడం తగ్గించాలని ప్రజలను కోరడం తప్పు అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.
 
ప్రజలు టీ తాగటం తగ్గించాలంటూ ప్రభుత్వం కోరటం సోషల్ మీడియాలో వైరల్ అయింది. జనటం టీ తాగటం తగ్గిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ సమస్యలు పరిష్కారమవుతాయా అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.