బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సందీప్
Last Updated : గురువారం, 14 మార్చి 2019 (17:32 IST)

బీమా సొమ్ముకోసం ప్రాణహానికి పాల్పడిన మహిళ

ఇన్సూరెన్స్ డబ్పులు కోసం సొంత వాళ్లకి హాని కలిగించడం లేదా ఏకంగా ప్రాణాలు తీసిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఇలాగే ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కక్కుర్తి పడిన ఓ మహిళ తనను సైతం గాయపరుచుకుంది. బీమా కంపెనీ నుండి భారీగా డబ్బు గుంజేయాలనే ఉద్దేశంతో ఈ పని చేసింది. ఈ ఘటన స్లోవేనియా దేశంలో చోటుచేసుకుంది. 
 
స్లోవేనియా రాజధాని నగరం జుబుల్‌జానాలో నివాసం ఉంటున్న ఓ 21 ఏళ్ల మహిళ ప్రమాద బీమా పాలసీ తీసుకుంది. దీని ప్రకారం పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రమాదానికి గురైతే నెలవారీ ఖర్చుల నిమిత్తం 3 వేల పౌండ్లు (2.75 లక్షలు పైగా) దానితోపాటు ప్రమాదం జరిగిన తర్వాత నాలుగు లక్షల పౌండ్లు (దాదాపు 3 కోట్లు 14 లక్షల రూపాయలు) సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది.
 
ఈ సొమ్ము కోసం కుటుంబ సభ్యులతో కలసి ప్రణాళిక సిద్ధం చేసింది. చేతికి గాయమైందంటూ ఆసుపత్రిలో చేరింది. ఇంటి దగ్గర తోటపని చేస్తుండగా ప్రమాదవశాత్తూ గాయమైందని వైద్యులకు తెలిపారు. కానీ ఇన్సూరెన్స్ కంపెనీకి మాత్రం దీనిపై అనుమానం వచ్చింది. వారి స్వంత వ్యక్తిగత డిటెక్టివ్ ద్వారా రహస్యంగా విచారణ జరిపించారు. దర్యాప్తులో బీమా డబ్బు కోసం తన చేతిని తానే నరుక్కుందని వెల్లడైంది. సొమ్ము కొట్టేయాలని బీమా కంపెనీని మోసం చేసినందుకు సదరు మహిళ మీద, తన కుటుంబసభ్యుల మీద ఇన్సూరెన్స్ కంపెనీ చీటింగ్ కేసు వేసింది.