గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (15:44 IST)

ఏడు నెలల గర్భవతిని కొండపై నుంచి తోసేసిన భర్త.. ఎందుకో తెలుసా?

భార్యాభర్తల అనుబంధం, ఆప్యాయత మంటగలిసిపోతోంది. గర్భవతి అయిన భార్యతో సెల్ఫీ తీసుకున్న భర్త అనంతరం ఆమెను కొండపై నుంచి తోసేశాడు. దీంతో కడుపులోని శిశివుతోపాటు ఆమె కూడా మరణించింది. టర్కీలోని ముగ్లలో ఈ దారుణం జరిగింది. 
 
40 ఏళ్ల హకన్ ఐసల్ ఏడు నెలల గర్భవతి అయిన 32 ఏళ్ల భార్య సెమ్రా ఐసల్‌ను ఫెథియే జిల్లాలోని బటర్‌ఫ్లై వ్యాలీకి విహార యాత్రకు తీసుకెళ్లాడు. వెయ్యి అడుగుల ఎత్తైన కొండపై ఆమెతో రొమాంటిక్‌ ఫోజులతో ఫొటోలు దిగాడు. అనంతరం భార్యను ఆ కొండ అంచు నుంచి తోసేశాడు. దీంతో ఎత్తు నుంచి కింద పడిన ఆమె, కడుపులోని బిడ్డతో పాటు మరణించింది. 
 
2018 జూన్‌లో ఈ దారుణానికి పాల్పడిన భర్త హకన్‌ను గత ఏడాది నవంబర్‌లో పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇన్సురెన్స్‌ డబ్బుల కోసమే గర్భవతి అయిన భార్యను అతడు హత్య చేసినట్లు ప్రాసిక్యూటర్‌ కోర్టులో ఆరోపించారు. ఇది కుట్రపూరితమైన హత్య అని పేర్కొన్నారు. 
 
భర్త హకన్‌ తన భార్య సెమ్రా పేరుతో 4 లక్షల టర్కీష్‌ లిరా (సుమారు రూ.41.66 లక్షలు)కు వ్యక్తిగత బీమా తీసుకున్నాడని, లబ్ధిదారుడిగా ఆయనే ఉన్నాడని తెలిపారు. భర్య మరణాంతరం బీమా డబ్బుల కోసం దరఖాస్తు చేయగా కేసు దర్యాప్తులో ఉన్నందున ఆ సంస్థ దానిని ఆమోదించలేదని చెప్పారు. 
 
మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలను హకన్‌ ఖండించాడు. తాను ఆమెను తోయలేదని, ఇది ప్రమాదవశాత్తు జరిగిన దుర్ఘటన అని పేర్కొన్నాడు. కాగా ఇరువైపు వాదనలు విన్న ఫెథియే హై క్రిమినల్ కోర్టు ఈ ఘటనను హత్యగానే పరిగణించింది. నిందితుడైన భర్త హకన్‌ను కస్టడీలో ఉంచాలని ఆదేశించింది.