శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 నవంబరు 2020 (13:23 IST)

అబ్బా.. చైనా ఏం చెప్పింది.. ఇండియా నుంచి కరోనా వచ్చి వుండొచ్చట!

చైనా కరోనా వైరస్‌కు భారత్ కూడా కారణమై వుండవచ్చునని పేర్కొంది. తద్వారా డ్రాగన్ కంట్రీ మరోసారి తన వక్ర బుద్ధిని చాటుకుంది. కరోనా వైరస్‌కు ఇండియా కూడా కారణం కావచ్చని అక్కడి అధికార మీడియా నిరాధార ఆరోపణలు చేస్తోంది. వైరస్ మొదట చైనాలో కనిపించినంత మాత్రాన అది ఇక్కడి నుంచే మొదలైందని ఎలా ఆరోపిస్తారని విమర్శిస్తోంది. 
 
విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఆహార ఉత్పత్తుల నుంచే వుహాన్‌కు కరోనా వైరస్ వచ్చిందని వాదిస్తోంది. ఇందులో ఇండియా నుంచి వచ్చిన ఒక చేపల కన్‌సైన్‌మెంట్ కూడా ఉన్నదని, అందులోనూ కరోనా వైరస్ జాడలు కనిపించినట్లు చెబుతోంది. ఈ వైరస్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) దర్యాప్తు మొదలుపెట్టనున్న సమయంలో చైనా ఇలాంటి ఆరోపణలు చేస్తుండటం గమనార్హం. 
 
అసలు కరోనా వైరస్ వుహాన్‌లో కనిపించిందా లేక అక్కడే పుట్టిందా అన్న అంశంపై డబ్ల్యూహెచ్‌వో విచారణ చేపట్టనుంది. చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్ కూడా ఇలాంటి ప్రకటనలే చేస్తున్నారు. చైనాలో కనిపించినంత మాత్రాన వైరస్ ఇక్కడే పుట్టిందని ఎలా చెబుతారంటూ ప్రశ్నిస్తున్నారు. వైరస్ ఎక్కడ పుట్టిందో తెలుసుకోవడం ఒక సంక్లిష్టమైన శాస్త్రీయ ప్రక్రియ అని అన్నారు. త్వరలోనే డబ్ల్యూహెచ్‌వో తన విచారణ మొదలుపెట్టనుంది.