గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 19 నవంబరు 2020 (10:33 IST)

కరోనా వైరస్ గురించి బాహ్య ప్రపంచానికి చెప్పిన చైనా విలేఖరికి జైలుశిక్ష!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పుట్టుక చైనాలోని వుహాన్ నగరం. ఇక్కడ నుంచే ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. ఒక విధంగా చెప్పాలంటే వుహాన్‌లోని ఓ బయోలాజికల్ పరిశోధనాశాలలో ఈ వైరస్‌ను తయారు చేసినట్టు వార్తలు వచ్చాయి. పైగా, ఈ వైరస్ గురించి చైనా జర్నలిస్టులే ప్రపంచానికి తెలిపారు. 
 
అలాంటి విలేఖరులు చాలా మంది వుహాన్ నగరంలో కనిపించకుండా పోయారు. ఒక వేళ కనిపించినా వారిపట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో కరోనా మహమ్మారి గురించి ప్రపంచానికి వెల్లడించిన విలేకరికి చైనా ప్రభుత్వం ఐదేళ్ళ జైలుశిక్ష విధించింది. ఈ విలేఖరి ఓ మాజీ న్యాయవాది కూడా. 37 ఏళ్ల ఝాంగ్‌ఝాన్ సిటిజన్ జర్నలిస్టుగా వుహాన్ నగరంలో పని చేస్తున్నారు. ఈమె వైరస్ వెలుగు చూసిన వుహాన్ వెళ్లి వైరస్‌కు సంబంధించి పలు కథనాలు రాసింది.
 
కరోనా వైరస్‌పై ప్రశ్నించిన పలు కుటుంబాలను పోలీసులు హింసించారని, కొందరు స్వతంత్ర విలేకరులు కనిపించకుండా పోయారంటూ తన కథనాల్లో పేర్కొంది. ఈ మేరకు చైనీస్ హ్యూమన్ రైట్ డిఫెండర్స్ (సీహెచ్ఆర్‌డీ) అనే స్వచ్ఛంద సంస్థ తెలిపింది. దీంతో ఆమె గొడవలకు దిగుతూ సమస్యలు సృష్టిస్తోందన్న ఆరోపణలతో మే నెలలో ఝాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత మూడు నెలలకు న్యాయవాదిని కలిసేందుకు ఆమెకు అనుమతి లభించింది.
 
తన అరెస్టుకు నిరసనగా ఝాన్ జైలులో నిరాహార దీక్షకు దిగిందని, సెప్టెంబరు 18న ఆమెను దోషిగా నిర్ధారించినట్టు ఆమె తరపు న్యాయవాదికి ఫోన్ వచ్చింది. వీచాట్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియాలో కొవిడ్‌పై తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేసినట్టు రుజువు కావడంతో ఆమెకు శిక్ష విధించినట్టు కోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ నేరాలన్నింటికీ కలిపి ఐదేళ్ల జైలు శిక్ష విధించాలని న్యాయస్థానం సూచించింది.