శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 నవంబరు 2020 (16:14 IST)

రిపబ్లిక్ టీవీ చీప్ అర్నాబ్ గోస్వామి తొలి రోజు జైలు జీవితం ఎలా గడిచిందంటే...

ముంబైకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అన్వే నాయక్‌ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించారన్న ఆరోపణల కేసులో రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్నాబ్ గోస్వామిని ముంబై పోలీసులు బుధవారం ఉదయం అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన్ను తొలిరోజు అలీభాగ్‌లోని ఓ పాఠశాలలో గడిపారు. ప్రస్తుతం దీన్ని తాత్కాలిక జైలుగా ఉపయోగిస్తున్నారు. 
 
ప్రధాన జైలుకు పంపేముందు మందు జాగ్రత్త చర్యగా 14 రోజుల పాటు నిందితులను జైలు అధికారులు క్వారంటైన్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగానే అర్నాబ్‌ను తాత్కాలిక జైళ్లో ఉంచారు. అలీభాగ్‌ జైలులో మొత్తం సామర్థ్యం 82 మందికి కాగా, ప్రస్తుతం అక్కడ 99మంది ఖైదీలున్నారు.
 
మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జైళ్లలో వైరస్‌ తీవ్రత పెరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని 23 నగరాల్లో 30కి పైగా తాత్కాలిక జైళ్లను ఏర్పాటుచేశారు. 
 
ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలలు, హాస్టళ్లు, కాలేజీలలో తాత్కాలికంగా ఖైదీలను ఉంచుతున్నారు. దీని వల్ల జైళ్లలో కరోనా వ్యాప్తి చెందకుండా సహాయపడుతుందని జైలు అధికారి ఒకరు తెలిపారు. 
 
14 రోజులపాటు క్వారంటైన్‌ అనంతరం వైద్య పరీక్షల తర్వాత సాధారణ జైళ్లకు తరలిస్తామని పేర్కొన్నారు. చుట్టూ పోలీసుల నడుమ తగిన భద్రత ఏర్పాటు చేశామని వివరించారు. ఈ ఏడాది మే నెలలో అలీభాగ్‌ జైళ్లో 158 మంది ఖైధీలకు కరోనా నిర్ధారణ కాగా, ఆర్థర్‌ జైలులో 28 మంది ఖైదీలకు కరోనా సోకింది. 
 
మరోవైపు, అర్నాబ్ అరెస్ట్ సందర్భంగా బయటకు వచ్చిన 13 నిమిషాల నిడివి ఉన్న వీడియోలో తమతో సహకరించాల్సిందిగా పోలీసులు పలుమార్లు అర్నాబ్‌ను కోరడం అందులో కనిపించింది. అయితే, అర్నాబ్ మాత్రం పోలీసులు తనపై దాడిచేసినట్టు ఆరోపిస్తున్నారు. దీన్ని కోర్టు తోసిపుచ్చింది.
 
కాగా, తనపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాల్సిందిగా అర్నాబ్ పెట్టుకున్న పిటిషన్‌ను గురువారం బాంబే హైకోర్టు విచారించనుంది. అలాగే, బెయిలు కోసం కూడా ఆయన దరఖాస్తు చేసే అవకాశం ఉందని సమాచారం.