శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 29 అక్టోబరు 2020 (18:14 IST)

వాయు కాలుష్య కారకులపై ఉక్కుపాదం.. ఐదేళ్ల జైలు.. రూ.కోటి ఫైన్

వాయు కాలుష్యంపై కేంద్రం కన్నెర్రజేసింది. ఇకపై వాయు కాలుష్యానికి పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపనుంది. ఎవరైనా గాలిని కలుషితం చేస్తే మాత్రం కేంద్రం ఎట్టిపరిస్థితుల్లోనూ సహించదు. ఇలాంటి వారిని గుర్తించి, ఐదేళ్ళ జైలుశిక్షతో పాటు.. కోటి రూపాయల వరకు అపరాధం విధించనుంది. ఈ మేరకు కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ రాజముద్ర వేశారు. 
 
వాస్తవానికి వాతావరణ కాలుష్యం వల్ల దేశం అన్ని విధాలుగా తీవ్రంగా నష్టపోతోంది. ప్రజల ఆరోగ్యం దెబ్బతినడమేకాకుండా, పర్యావరణం కూడా నాశనమవుతోంది. ఈ నేపథ్యంలో వాయుకాలుష్య కారకులపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. 
 
వాయుకాలుష్య కారకులకు గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్షతో పాటు, ఒక కోటి రూపాయల వరకు జరిమానా విధించేందుకు ఈ ఆర్డినెన్స్ అవకాశం కల్పించింది. ఈ ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు.
 
కేంద్ర ఆర్డినెన్స్ ప్రకారం ప్రకారం ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కోసం కమిషన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిషన్ ఛైర్మన్‌ను కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి అధ్యక్షతన ఏర్పాటయ్యే కమిటీ ఎంపిక చేస్తుంది. 
 
కమిటీలో సభ్యులుగా వాణిజ్య శాఖ, రవాణా శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులు, కేబినెట్ సెక్రటరీ ఉంటారు. ఈ కమిషన్ ఇచ్చే ఆదేశాలను సివిల్ కోర్టుల్లో సవాలు చేయడానికి వీల్లేదు. కేవలం జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్‌లో మాత్రమే సవాలు చేయవచ్చు.