శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 అక్టోబరు 2020 (16:28 IST)

ఆంధ్రాలో ఆంగ్లం... అమెరికాలో "అ.. ఆ"లు... తెలుగులో బ్యాలెట్ పత్రాల ముద్రణ!

కోట్లాది మందికి మాతృభాషగా ఉన్న తెలుగును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంపేసే ప్రక్రియ కొనసాగుతోందని అనేక మంది భాషాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, రాష్ట్రంలో ప్రాథమిక విద్యను మాతృభాషలో కాకుండా ఆంగ్లంలో బోధించాలని అధికార వైకాపా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా చకచకా అడుగులు వేసింది.

అంతేనా... రాష్ట్రంలోని స్కూల్స్‌లో తెలుగు మీడియం స్థానంలో ఆంగ్ల మీడియంను బలవంతంగా తీసుకొచ్చింది. అంటే.. ఆంధ్రలో మాతృభాష అయిన తెలుగును శాశ్వతంగా చంపేసే ప్రయత్నాలు జరిగాయి. కానీ, అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం తెలుగు భాషకు అరుదైన గుర్తింపు లభించింది. తెలుగు భాషకు అమెరికా పట్టంకట్టింది. అమెరికాలో కమ్యూనికేషన్ కోసం తెలుగు భాషను అధికారిక భాషగా గుర్తిస్తూ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
 
ఆ దేశ అధ్యక్ష ఎన్నికలు వచ్చే నెల మూడో తేదీన జరుగనున్నాయి. ఈ క్రమంలో అమెరికాలో ప్రభుత్వ గుర్తింపు ఉన్న ప్రపంచ భాషల్లో బ్యాలెట్ పత్రాలను ముద్రిస్తారు. ఇప్పటివరకు కొన్ని భారతీయ భాషలు మాత్రమే ఈ జాబితాలో ఉండేవి. ప్రస్తుతం వాటి సరసన తెలుగు కూడా చేరింది. దీంతో తెలుగులో కూడా బ్యాలెట్ పేపర్ల ముద్రణ జరగనుంది.
 
అమెరికాలో తెలుగు భాషను అధికార భాషగా గుర్తించడం ద్వారా ఇకపై ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సమాచారంతోపాటు అధికార కార్యకలాపాల వివరాలను కూడా తెలుగులో తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. 
 
కాగా, అధికారిక లెక్కల ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 15 కోట్ల మంది తెలుగు మాట్లాడే వారు ఉన్నారు. అమెరికాలో కూడా తెలుగు మాట్లాడే వారి సంఖ్య ఎక్కువే ఉంది. కాగా.. అమెరికాలో తెలుగు భాషకు దక్కిన గౌరవంపట్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కళ్లు తెరిచి చూడాలని పలువురు భాషాభిమానులు కోరుతున్నారు. ముఖ్యంగా, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అయిన ఏ మీడియంలో చదవాలన్న అంశాన్ని విద్యార్థుల ఇష్టానికే వదిలివేయాలని, ప్రాథమిక విద్యను ఖచ్చితంగా మాతృభాషలోనే బోధించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.