శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 నవంబరు 2020 (10:53 IST)

న్యూఢిల్లీ నుంచి వుహాన్ వెళ్లిన వారికి కరోనా - భారత్‌లో కొత్తగా 38 వేల కేసులు

కరోనా లాక్డౌన్ సమయంలో వివిధ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్రం వందే భారత మిషన్ కింద అనేక దేశాలకు ప్రత్యేక విమానాలను నడిపింది. ఈ క్రమంలో ఈ నెల 13 నుంచి చైనాకు మరో నాలుగు విమానాలను నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు భారత్ సోమవారం ప్రకటించింది.
 
అయితే, న్యూఢిల్లీ నుంచి చైనా నగరం వుహాన్‌కు వందేభారత్ మిషన్ (వీబీఎం) విమానంలో 19 మంది భారతీయ ప్రయాణికులు కొవిడ్‌-19కు పాజిటివ్‌గా పరీక్షించారు. వందే భారత్‌ మిషన్‌లో భాగంగా అక్టోబర్‌ 30న వూహాన్‌ నగరానికి వెళ్లింది. ఆ విమానంలో 19 మందికి పాజిటివ్‌గా గుర్తించారు. మరో 39 మంది యాంటీబాడీలు గుర్తించినట్లు అధికారులు అధికారులు పేర్కొన్నారు. 
 
కాగా, మహమ్మారి బారినపడ్డ భారతీయులను దవాఖానకు తరలించినట్లు తెలిపారు. నవంబర్‌ 13 నుంచి మరో నాలుగు విమానాలు వుహాన్‌కు నడపాలని భావిస్తున్నట్టు కేంద్రం ప్రకటించిన సమయంలో ఈ కేసులు బయటపడటం గమనార్హం. ఈ నెల 13, 20, 27, డిసెంబర్ 4 తేదీల్లో ఎయిర్‌ ఇండియా యోచిస్తున్నట్లు భారత రాయబార కార్యాలయం సోమవారం ప్రకటించింది. 
 
ఈ తరుణంలో విమానంలో 19 మందికి కొవిడ్‌ సోకినట్టు తేలడం కలకలం రేపుతోంది. ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా వైరస్‌ వుహాన్‌ నగరంలోనే పుట్టిన విషయం తెలిసిందే. డిసెంబర్‌లో వైరస్‌ వెలుగులోకి వచ్చిన తర్వాత వూహాన్‌ నుంచి ఢిల్లీకి 277 మంది భారతీయులు దేశానికి తీసుకువచ్చింది.
 
మరోవైపు, దేశంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో 38,310 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 82,67,623కి చేరింది.
 
గ‌త 24 గంట‌ల సమయంలో 490 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,23,097కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 76,03,121 మంది కోలుకున్నారు. 5,41,405 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
     
కాగా, దేశంలో సోమవారం వరకు మొత్తం 11,17,89,350 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,46,247 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.