శనివారం, 26 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 18 మే 2016 (16:25 IST)

మేక్ ఇన్ ఇండియా : రూ.99కే స్మార్ట్‌ఫోన్.. నమోటెల్ కంపెనీ ఆఫర్... బుకింగ్స్ ప్రారంభం

'మేక్ ఇన్ ఇండియా' పుణ్యమాని కారు చౌకకే స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే 'ఫ్రీడమ్ 250' పేరుతో రింగింగ్ బెల్స్ కంపెనీ కారుచౌక స్మార్ట్‌ఫోన్లు అందివ్వనుంది. ఇపుడు ఇదే బాటలో మరో కంపెనీ ముందుకు వచ్చింది. ఈ కంపెనీ కేవలం 99 రూపాయలకే స్మార్ట్‌ఫోన్‌ను ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ కంపెనీ పేరు నమోటెల్ డాట్‌కామ్. 
 
ఇదే అంశంపై నమోటెల్‌ కంపెనీ సీఈఓ మాధవ రెడ్డి మాట్లాడుతూ... నమోటెల్ అచ్చేదిన్ మొబైల్‌ను పొందదలచిన వారు బి మై బ్యాంకర్‌ డాట్‌కామ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఐడి, పాస్‌వర్డ్‌ను పొందాలన్నారు. ఇందులో లాగిన్ అయ్యాక ఆన్‌లైన్ రూపంలో నగదు చెల్లించాలి. ఆ తర్వాత బీఎంబీ రెఫరెన్స్ ఐడి అందుతుంది. వాటి ఆధారంగా నమోటెల్‌ డాట్‌ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఫోటో, ఆధార్‌ కార్డును జతచేస్తే స్మార్ట్‌ఫోన్‌ను సరఫరా చేస్తామన్నారు. అయితే, బి మై బ్యాంకర్‌లో సభ్యుడిగా చేరితే మాత్రమే నోవాటెల్‌లో రిజిస్ట్రేషన్ సాధ్యమన్నారు.
 
కాగా, వాస్తంగా ఈ ఫోన్ ధర రూ.2999 అయితే కేవలం రూ.99కే అందజేస్తున్నట్టు తెలిపారు. మేక్ ఇన్ ఇండియాను ఆదర్శంగా చేసుకుని ఈ ఫోన్ల విక్రయం చేపట్టామని, ఖచ్చితంగా మొబైల్ వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని తాము ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. అయితే, వీటిని పరిమిత సంఖ్యలోనే ఆధార్ నంబరుతో అనుసంధానం చేసి విక్రయిస్తామని తెలిపారు. 
 
ఈ ఫోన్ ఫీచర్లను పరిశీలిస్తే.. ఆండ్రాయిడ్ 5.1 లాల్లీపాప్‌తో పని చేసే నాలుగు అంగుళాల డిస్ప్లే, 1.3 జిహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ ప్రాసెస్సర్, వన్ జీవీ ర్యామ్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయన్నారు. ఈ ఫోన్ల కోసం ఈనెల 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు బుక్‌ చేసుకోవచ్చని తెలిపారు.