శుక్రవారం, 5 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 18 ఆగస్టు 2023 (11:32 IST)

హిమాచల్ ప్రదేశ్‌లో జలప్రళయంతో 74 మంది మృత్యువాత

himachal pradesh floods
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో సంభవించిన జలప్రళయం సృష్టించింది. ఈ ప్రళయంలో 74 మంది మృత్యువాతపడ్డారు. అలాగే, ఈ భారీ వర్షాల కారణంగా 10 వేల కోట్ల నష్టం వాటిల్లింది. జూలై నెలలో సంభవించిన భారీ వరద ఘటనను మరువకముందే మరోమారు ఆ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ విపత్తు కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వేల కోట్ల రూపాయాల మేరకు ఆస్తి నష్టం వాటిల్లింది.
 
అలాగే, గత వారం రోజులుగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కుంభవృష్టి కురుస్తుంది. దీంతో రాష్ట్రంలోని నదులు పొంగి ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వరద ప్రవాహానికి రోడ్లు వంతెనలు కొట్టుకునిపోయాయి. పలు చోట్ల భారీగా కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఈ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 74 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర రాజధాని సిమ్లాలోని సమ్మర్ హిల్ ప్రాంతంలో సోమవారం భారీగా కొండ చరియలు విరిగిపడిన విషయం తెల్సిందే. ఈ ఘటనలో సుమారు 21 మంది చనిపోయారు. 
 
మరోవైపు, ఈ జలప్రళయంతో రాష్ట్ర టూరిజం పడిపోయింది. సాధారణంగా కొండ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఏటా పర్యాటకులు పోటెత్తేవారు. ఈ వర్ష ప్రభావంతో పర్యాటకుల తాకిడి భారీగా తగ్గింది. దీంతో ఆ రాష్ట్ర ఆదాయానికి భారీగా గండిపడింది. ముఖ్యంగా స్థానికంగా ఉన్న ట్యాక్సీ డ్రైవర్లు గతంలో రోజుకు రూ.2 వేలు సంపాదించేవారు. ఇప్పుడు రోజుకు రూ.200 రావడం కూడా కష్టంగా మారింది. సాధారణంగా 50 నుంచి 60 శాతంగా ఉన్న హోటల్‌ ఆక్యుపెన్సీ.. ప్రస్తుతం 5 శాతానికి పడిపోయిందంటే ఆ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.