ఉత్తరాఖండ్ శాసనసభలో బలపరీక్ష నెగ్గిన హరీష్ రావత్
ఉత్తరాఖండ్ రాష్ట్ర శాసనసభలో జరిగిన విశ్వాస పరీక్షలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ గెలుపొందారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మంగళవారం శాసనసభలో విశ్వాస పరీక్ష జరిగింది. ఈ పరీక్షా ఫలితాలను అటార్నీ జనరల్ బుధవారం సుప్రీంకోర్టుకు సమర్పించారు. బలపరీక్షలో హరీశ్ రావత్ మెజార్టీ సాధించారని ఏజీ ప్రకటించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పిస్తూ ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన తొలగిస్తామని సుప్రీంకోర్టుకు తెలిపారు.
ఈ బలపరీక్షలో కాంగ్రెస్కు 33, బీజేపీకి 27 ఓట్లు రావడంతో రావత్ బలపరీక్షలో విజయం సాధించినట్లు బుధవారం సుప్రీంకోర్టు అధికారికంగా ప్రకటించింది. దీంతో హరీష్ రావత్తు మెజారిటీ ఉన్నందున రాష్ట్రపతి పాలనను రద్దు చేస్తామని సుప్రీం కోర్టుకు అటార్నీ జనరల్ స్పష్టం చేశారు. ఆ వెంటనే కేంద్ర కేబినెట్ సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. సుప్రీం కోర్టు ప్రకటన నేథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.