మమతా బెనర్జీ - జయలలితలకు ఎదురేదీ.. ప్రధాని మోడీ అభినందలు
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ (వెస్ట్ బెంగాల్), అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత (తమిళనాడు)ల మధ్య ఇంచుమించు ఒకే విధమైన పోలికలున్నాయి. ఇద్దరూ కుమారిలే. ఇద్దరూ ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఇద్దరూ పార్టీ అధినేత్రులుగా ఉంటూ.. పార్టీ శ్రేణులను తన గుప్పెట్లో పెట్టుకుని.. కనుసైగలతో పాలన సాగిస్తున్నారు. ఇలాంటి ఈ ఇద్దరు మహిళా మణులు సరికొత్త చరిత్ర సృష్టించారు.
కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న బెంగాల్ రాష్ట్రంలో పాగా వేసిన దీదీ.. తాజాగా వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో రెండోసారి కూడా అధికార పీఠాన్ని దక్కించుకున్నారు. అలాగే, తమిళనాడు రాష్ట్రంలో కూడా జయలలిత పాత సంప్రదాయానికి పాతరేసి.. రెండోసారి వరుసగా సీఎం కుర్చీని అలంకరించబోతున్నారు.
మొత్తం 294 స్థానాల్లో 217పైగా స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఫలితంగా వరుసగా రెండోసారి పశ్చిమబెంగాల్ పీఠాన్ని మమతాబెనర్జీ దక్కించుకున్నారు. ఇంతకుముందు వరుసగా వామపక్షాల పాలనలో ఉన్న పశ్చిమబెంగాల్ను గెలుచుకుని గత ఎన్నికల్లో దీదీ చరిత్ర తిరగరాశారు. ఇప్పుడు కూడా వామపక్షాలు, కాంగ్రెస్ జతకట్టినా ఆమెను ఓడించలేకపోయాయి.
ఇకపోతే తమిళనాడులో అన్నాడీఎంకే 126 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. విపక్షమైన డీఎంకే కూటమి 102 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, ఇతరులు నాలుగు సీట్లలో ముందంజలో ఉన్నారు. దీంతో జయలలిత వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.
వీరిద్దరికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందలు తెలిపారు. అలాగే, అసోంలో బీజేపీని గెలిపించిన ప్రజలకు ప్రధాని కృతజ్ఞతలు తెలియజేశారు. అసోంలో బీజేపీ గెలుపు కోసం కృషిచేసిన ప్రతి కార్యకర్తకు సెల్యూట్ అంటూ ట్విట్టర్లో మోడీ ట్వీట్ చేశారు.