1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 26 నవంబరు 2023 (10:11 IST)

రాజస్థాన్‌ ఎన్నికలు.. రికార్డు స్థాయిలో 74.96 శాతం ఓటింగ్ నమోదు

Rajasthan
రాజస్థాన్‌లో శనివారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 74.96 శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం అధికారులు ఆదివారం పోలింగ్ డేటాను ప్రకటించారు. పోలింగ్ స్టేషన్లలో 74.13 శాతం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్ ద్వారా పోలైన 0.83 శాతం ఓట్లు ఉన్నాయి.
 
పోకరన్‌లో అత్యధికంగా 87.79 శాతం ఓటింగ్ నమోదైంది. తిజారాలో 85.15 శాతం ఓటింగ్ నమోదై రెండో స్థానంలో ఉంది. అత్యల్ప ఓటింగ్ శాతం ఉన్న మార్వార్ జంక్షన్‌లో 61.10 శాతం, అహోర్‌లో 61.19 శాతం ఓటింగ్ నమోదైందని పోల్ అధికారులు తెలిపారు. 
 
రాష్ట్రంలోని 199 అసెంబ్లీ స్థానాలకు శనివారం పోలింగ్ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ చాలా వరకు ప్రశాంతంగా జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కూనర్ (75) మృతి చెందడంతో శ్రీ కరణ్‌పూర్ అసెంబ్లీ నియోజక వర్గానికి శనివారం పోలింగ్ జరగలేదు.