గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 మార్చి 2023 (12:00 IST)

విడాకుల కోసం భార్య రూ.10 లక్షల డిమాండ్ .. కిడ్నీ విక్రయానికి భర్త ప్రచారం

kidney for sale
కట్టుకున్న భార్యకు విడాకులు ఇచ్చేందుకు ఆ భర్త కఠిన నిర్ణయం తీసుకున్నాడు. అయితే, విడాకులు కావాలంటే పది లక్షలు చెల్లించాలంటూ డిమాండ్ చేసింది. అంత డబ్బు చెల్లించలేని భర్త పోలీసులను ఆశ్రయించాడు. అక్కడ కూడా ఫలితం లేకుండా పోయింది. దీంతో భార్య, అత్తమామలు అడిగిన డిమాండ్ మేరకు రూ.10 లక్షల డబ్బు చెల్లించేందుకు తన కిడ్నీని విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఓ బ్యానరులో కిడ్నీని విక్రయిస్తానంటూ ప్రచారం చేస్తున్నారు. "నా మూత్రపిండం అమ్మకానికి సిద్ధంగా ఉంది", మార్చి 21వ తేదీన ఆత్మాహుతి కార్యక్రమం అని రాసి భార్యతో కలిసి, విడివిడిగా ఉన్న ఫోటోలతో కూడిన ఓ బ్యానరుతో తిరుగుతున్నాడు. రోడ్డుపై బ్యానరుతో అతడిన చూసిన కొందరు ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్ అయింది. ఈ దృశ్యం హర్యానా రాష్ట్రంలోని ఫరిదాబాద్‌లో కనిపించింది. 
 
బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాకు చెందిన సంజీవ్ అనే వ్యక్తికి ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఈయన సంసారం కొన్నాళ్లపాటు సాఫీగానే సాగింది. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. భార్య, బావమరిది, అత్తమాల నుంచి సంజీవ్‌కు వేధింపులు ఎక్కువయ్యాయి. వీటిని భరించలేని ఆయన.. విడాకులు తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చేశాడు.
 
ఇక్కడే అసలు సమస్య ఉత్పన్నమైంది. విడాకులు కావాలంటే రూ.10 లక్షలు ఇవ్వాల్సిందేనని భార్య, అత్తమామలు పట్టుబట్టారు. ఏం చేయాలో తెలియని సంజీవ్ పోలీసులను ఆశ్రయించాడు. అక్కడ కూడా అతనికి నిరాశే ఎదురైంది. ఇక ఏ దారీ కనిపించకపోవడంతో ఇలా చేతిలో బ్యానరుతో తిరుగుతున్నాడు. 
 
ఈ నెల 21వ తేదీలోపు తన కిడ్నీ అమ్ముడు పోతే ఆ డబ్బులు చెల్లించి తన భార్య నుంచి విడాకులు తీసుకుంటానని లేకపోతే ఆ రోజున ఆత్మహత్య చేసుకుంటానని బ్యానరులో రాశాడు. అంతేకాదండోయ్.. తన ఆంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌లను ఆహ్వానిస్తూ వారి పేర్లను కూడా ముద్రించాడు. రెండోవైపున తన భార్య, బావమరిది, అత్తమామలు, వారి బంధువుల ఫోటోలను ముద్రించాడు.