1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 ఏప్రియల్ 2020 (10:44 IST)

భారత్‌లో కరోనా కేసులు 15707 - మరణాలు 507

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. ఫలితంగా దేశంలో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 15,707కు చేరుకోగా, ఈ వైరస్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 507కు చేరాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
 
ముఖ్యంగా, గత 24 గంటల్లో 1,329 కొత్త కేసులు న‌మోదయ్యాయి. భార‌త్‌లో మ‌ర‌ణాల రేటు 3.3 శాతంగా ఉన్న‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించిన విషయం తెల్సిందే. 
 
క‌రోనా మ‌హ‌మ్మారి ఎక్కువ‌గా వృద్దుల‌పైనే ప్ర‌భావాన్ని చూపుతుంది. ఇప్ప‌టివ‌ర‌కు మ‌ర‌ణించిన వారిలో వ‌య‌సు పైబ‌డిన‌వారే అత్య‌ధికంగా ఉంటున్నారు. దేశవ్యాప్తంగా క‌రోనా మృతుల్లో 42 శాతం.. 75 ఏళ్లు పైబ‌డిన వాళ్లేన‌ని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 
 
ఇకపోతే, తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి మరింతగా పెరుగుతోంది. ఇతర ప్రాంతాల్లో కేసుల నమోదు తక్కువగా ఉన్నప్పటికీ హైదరాబాద్‌, గద్వాల జిల్లాల్లో మాత్రం అధికంగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం 43 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 31, గద్వాల జిల్లాలో ఏడుగురు వ్యాధి బారినపడ్డారు. 
 
సిరిసిల్లలో 2, రంగారెడ్డిలో 2, నల్లగొండ జిల్లాలో ఒక కేసు నమోదైంది. మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటికి 809 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 18 మంది మరణించారు. కరోనా నుంచి 186 మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ నెల 5వ తేదీ తర్వాత రోజుకు సగటున 50కి పైగా కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది.