శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 నవంబరు 2020 (20:12 IST)

క్రెడిట్ కార్డు వాడే వారికి సుప్రీం షాక్.. చక్రవడ్డీ మాఫీ అవసరం లేదు..!

కరోనా వైరస్ కారణంగా విధించబడిన లాక్ డౌన్ కారణంగా చాలామంది ఉద్యోగులు ఇంటికే పరిమితం అయ్యారు. దీంతో బ్యాంకులు రుణాలపై మారటోరియం విధించాయి. క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు, హోమ్ లోన్లపై ఈ మారటోరియం విధించడం జరిగింది. కానీ తాజాగా క్రెడిట్ కార్డు ఉయోగిస్తున్న వారికి సుప్రీం కోర్టు షాకిచ్చింది.

క్రెడిట్ కార్డు వాడే వారికి... లోన్ మారటోరియం వడ్డీ మీద వడ్డీ మాఫీ ప్రయోజనం అవసరం లేదని అభిప్రాయపడింది. 'క్రెడిట్ కార్డు వినియోగదారులు రుణ గ్రహీతల కిందకు రారు' అని సుప్రీం కోర్టు పేర్కొంది. క్రెడిట్ కార్డు వినియోగదారులు రుణాలను పొందలేదని, కొనుగోళ్ళు మాత్రమే చేశారని స్పష్టం చేసింది.
 
కరోనా నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిన విషయం తెలిసిందే. అలాంటి పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. లోన్ మారటోరియం ప్రయోజనాన్ని అందుబాటులోకి సుకువచ్చింది. పర్సనల్ లోన్ మొదలుకుని క్రెడిట్ కార్డుల వరకు ఈ లోన్ మారటోరియం వర్తిస్తుందని ఆర్‌బీఐ తెలిపింది. బ్యాంకులు కూడా వారి ఖాతాదారులకు ఈ ప్రయోజనాన్నందించాయి. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ... అసలు కథ ఇక్కడే మొదలైంది.
 
ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొంత మంది సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు లోన్ మారటోరియం అంశంపై సుప్రీం కోర్టులో వాదనలు నడుస్తున్నాయి. వడ్డీ మీద వడ్డీ మాఫీకి కేంద్రం సుముఖంగా ఉన్నా కూడా ఆర్‌బీఐ మాత్రం దీనికి అంగీకరించడం లేదు. దీని వల్ల ఆర్థిక వ్యవస్థపై, మరీ ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంటోంది.
 
సుప్రీం కోర్టులో గురువారం కూడా ఈ అంశంపై వాదనలు జరిగాయి. ఈ క్రమంలో... సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. క్రెడిట్ కార్డు వినియోగదారులకు చక్రవడ్డీ మాఫీ ప్రయోజనం అందించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. క్రెడిట్ కార్డు వినియోగదారులకు మింగుడుపడని వార్తేనని చెప్పుకోవచ్చు.