శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 24 మార్చి 2020 (05:03 IST)

నేటి నుంచి డొమెస్టిక్ విమానాలు రద్దు

దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రత పెరగడంతో దేశంలో అన్ని డొమెస్టిక్ విమానాలనూ రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించింది. నేటి అర్ధరాత్రి నుంచి దేశ వ్యాప్తంగా డొమెస్టిక్ విమానాలను రద్దు చేసింది. కార్గో విమానాలకు మాత్రం అనుమతిస్తామని పేర్కొంది.
 
ఎయిరిండియా సిబ్బందికి సైతం ఇబ్బందులు!
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో... ఎయిరిండియా సిబ్బందికి సైతం ఇబ్బందులు తప్పడం లేదు.  కరోనా ప్రభావిత దేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు వెళ్లిన సిబ్బందిని తిరిగి రానివ్వకుండా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు అడ్డుకోవడమే దీనికి కారణం. దీనిపై ఎయిరిండియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

దేశ ప్రజల కోసం ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని ఇలా అడ్డుకోవడం వారిని అవమానించమేనని పేర్కొంది. ‘‘చాలా చోట్ల రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లకు సంబంధించిన విజిలెంట్లు, పొరుగిళ్ల వారు విమాన సిబ్బందిని బహిష్కరించడం, విధులు నిర్వహించకుండా అడ్డుకోవడం, పోలీసులను పిలిపించడం మొదలుపెట్టారు. తమ విధి నిర్వహణ కోసం విదేశాలకు వెళ్లిరావడమే తప్పు అన్నట్టు వ్యవహరిస్తున్నారు.

ఇది తీవ్ర ఆందోళనకరమైన విషయం. కానీ ఈ విజిలెంట్లు ఓ విషయం మర్చిపోతున్నారు. వారికి సంబంధించిన జీవిత భాగస్వాములు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, పిల్లలు, సమీప బంధువులు, సన్నిహితులను కరోనా ప్రభావిత దేశాల నుంచి విమాన సిబ్బంది భద్రంగా, సురక్షితంగా తీసుకొచ్చారు. ఇందుకోసం ఎయిరిండియా సిబ్బంది చేసిన వీరోచిత ప్రయత్నాలకు అందరూ కృతజ్ఞతలు చెప్పాలి...’’ అని ఎయరిండియా ఓ ప్రకటనలో పేర్కొంది. 

కరోనా వైరస్ ప్రభావిత దేశాల్లో చిక్కుకున్న అనేక మంది భారతీయులు, ప్రత్యేకించి విద్యార్ధులను వెనక్కి తీసుకొచ్చేందుకు ఎయరిండియా తీవ్రంగా కృషిచేస్తోంది. అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ చైనాలోని వుహాన్, జపాన్, మిలాన్, రోమ్, ఇరాన్ తదితర దేశాల నుంచి పెద్ద ఎత్తున భారతీయులను స్వదేశానికి తరలించింది.

‘‘కోవిడ్-19 ప్రభావిత దేశాలకు విమానాలను పంపిన ప్రతిసారీ సిబ్బంది క్షేమం కోసం, వారి ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ఎయరిండియా అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. విమాన సిబ్బందికి, ప్రయాణికులకు వైరస్ సోకకుండా అవసరమైన అన్ని ప్రమాణాలను పాటిస్తోంది...’’ అని ఎయిరిండియా స్పష్టం చేసింది.