1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 డిశెంబరు 2020 (12:28 IST)

రైతులకు వ్యతిరేకం కాదు... సాగు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి!.. గడ్కరీ

ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై రైతులు రగిలిపోతున్నారు. దేశ రాజధానికి సరిహద్దుల్లో తిష్టవేసి ఆందోళన చేస్తున్నారు. వీరితో కేంద్ర మంత్రులు పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో రైతులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. ఇందులోభాగంగా సోమవారం ఒక రోజు నిరాహారదీక్ష కూడా చేశారు. అలాగే, ఈ నెల 19వ తేదీ వరకు తమ కార్యాచరణను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ సాగు చట్టాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు 
 
తమ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకం కాదన్నారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను అన్నదాతలు అర్థం చేసుకోవాలని హితవు పలికారు. రైతుల అభివృద్ధి కోసం కేంద్రం కట్టుబడి ఉందన్నారు. సమస్యల పరిష్కారం విషయంలో రైతులు చర్చలకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
వారు కొత్త చట్టాలపై అవగాహన పెంచుకోవాలని కోరారు. ఆ వ్యవసాయ చట్టాలపై రైతులు ఇచ్చే సూచనలను స్వీకరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైతులు చేస్తోన్న ఆందోళనల్లో కొన్ని శక్తులు జోక్యం చేసుకుని ఈ ఆందోళనలు దుర్వినియోగమయ్యేలా రైతులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని చెప్పుకొచ్చారు. 
 
రైతులకు వ్యతిరేకంగా తాము ఎలాంటి చట్టాలు చేయలేదని, అలాంటి తప్పులు ఎన్నడూ చేయబోమన్నారు. నూతన చట్టాలతో అన్నదాతలు తమ పంటలను దేశంలో ఎక్కడైనా, ఎవరికైనా అమ్ముకోవచ్చని వివరించారు. ఇదే విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పేందుకు తమ సర్కారు ప్రయత్నాలు జరుపుతోందని నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు.