1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 జూన్ 2024 (11:30 IST)

పోస్టల్ బ్యాలెట్ల‌పై వైకాపాకు చుక్కెదురు : ఈసీ నిర్ణయంలో జోక్యం చేసుకోలేం!

court
పోస్టల్ బ్యాలెట్ల అంశంలో అధికార వైకాపాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో గట్టి షాక్ తగలింది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టంచేసింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారంపై ఆర్వో (రిటర్నింగ్ ఆఫీసర్) సంతకం ఉంటే సరిపోతుందని, స్టాంపు, హోదా లేకపోయినా ఫర్వాలేదన్న ఎన్నికల సంఘం వాదనలను సమర్థిస్తూ ఆంధ్రప్రదేశ్  హైకోర్టు శనివారం తీర్పును వెలువరించింది. 
 
వివాదాస్పదమైన పోస్టల్ బ్యాలెట్ల అంశంలో వైసీపీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారం 13ఏపై ఆర్వో సంతకంతో పాటు కనీసం చేతిరాతతో అయినా హోదా వివరాలు రాసి ఉండాలని ఎన్నికల సంఘం గతంలో పేర్కొందని, కానీ ఏపీ సీఈవో అందుకు భిన్నంగా మెమో జారీ చేశారని వైసీపీ తన పిటిషన్‌లో ఆరోపించింది. సంతకం ఉంటే చాలని, సీల్ లేకపోయినా ఫర్వాలేదని మెమోలో పేర్కొనడం ఈసీ నిబంధనలను ఉల్లంఘించడమేనని పేర్కొంది.
 
ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాదనలు ఆలకించిన పిమ్మట తీర్పును శనివారానికి వాయిదా వేసింది. ఆ ప్రకారంగా శనివారం తీర్పును వెలువరిస్తూ, ఈసీతో ఏకీభవిస్తూ తీర్పు వెలువరించింది. పోస్టల్ బ్యాలెట్‌పై స్టాంపు లేకపోయినా అది కౌంటింగ్‌కు చెల్లుబాటు అవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో వైసీపీ పిటిషన్‌ను తోసిపుచ్చింది.