మంగళవారం, 2 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 మే 2024 (12:40 IST)

కోర్టు బెయిల్ మంజూరు చేయగానే మాచర్లలో ప్రత్యక్షమైన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి!!

pinnelni
ఈ నెల 13వ తేదీన ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున ఓ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న అధికార వైకాపా, మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఉపశమనం లభించింది. ఆయనపై ఏపీ పోలీసులు నమోదు చేసిన మరో మూడు కేసుల్లో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ వెంటనే ఆయన నరసరావుపేటలో ప్రత్యక్షమయ్యారు. ఆయనపై నమోదైన కేసుల్లో జూన్ ఆరో తేదీ వరకు అరెస్టు చేయొద్దంటూ మంగళవారం మధ్యాహ్నం ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఆదేశాలు జారీ అయిన కొన్ని నిమిషాల్లోనే ప్రత్యక్షమయ్యారు. 
 
ఆ తర్వాత రాత్రి 9 గంటల సమయంలో నరసరావుపేట చేరుకున్న ఆయన స్థానికంగా ఓ హోటల్లో బస చేశారు. ప్రతి రోజూ ఎస్పీ ఎదుట హాజరు కావాలన్న కోర్టు షరతు ప్రకారం రాత్రి 12 గంటల సమయంలో పల్నాడు ఎస్పీ మలికా గార్గ్ ఎదుట హాజరయ్యారు. ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేసిన వీడియో ఈ నెల 21న వెలుగులోకి వచ్చింది. దీనిని తీవ్రంగా పరిగణించిన ఈసీ ఆయనను అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించింది. అప్పటికే ఆయన పరారైనట్టు గుర్తించిన పోలీసులు పిన్నెల్లి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఆయన చిక్కలేదు.
 
ఈ కేసులో ముందస్తు బెయిలు కోరుతూ హైకోర్టును ఆశ్రయించగా అరెస్టు చేయవద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది. అయితే, ఆయనపై హత్యాయత్నం, అల్లర్లు, దాడులు, బెదిరింపులు తదితర అభియోగాలపై నమోదైన కేసుల్లో అరెస్టు చేసే అవకాశం ఉందని భావించిన ఆయన అజ్ఞాతం వీడలేదు. తాజాగా ఆ కేసుల్లోనూ ఉపశమనం లభించడంతో బయటకు వచ్చారు.