బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం  
                                       
                  
				  				   
				   
                  				  బాలీవుడ్ సూపర్ స్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్కు భద్రత పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఖలీస్థానీ అనుకూల సంస్థ సిక్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్ఐ) నుంచి ఆయనకు బెదిరింపులు రావడమే దీనికి కారణం. ఈ హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయనకు కట్టుదిట్టమైన భద్రతను కల్పించాలని కేంద్రం నిర్ణయించింది.
				  											
																													
									  
	 
	ఇటీవల అమితాబ్ హోస్ట్గా వ్యవహరిస్తున్న 'కౌన్ బనేగా కరోడ్పతి' షోకు పంజాబీ గాయకుడు, నటుడు దిల్జిత్ దోసాంజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అమితాబ్ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సంఘటనే తాజా వివాదానికి దారితీసింది. దిల్జిత్ చర్య 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన వారిని అవమానించడమేనని ఎస్ఎఫ్జే ఆరోపించింది.
				  
	 
	1984లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య అనంతరం జరిగిన హింసలో అమితాబ్ బచ్చన్ పాత్ర ఉందని ఎస్ఎఫ్జే చాలాకాలంగా ఆరోపణలు చేస్తోంది. ఇప్పుడు దిల్జిత్ ఆయన కాళ్లకు నమస్కరించడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో ఎస్.ఎఫ్.జి చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్, అమితాబక్కు హెచ్చరికలు జారీ చేశాడు. అంతేకాకుండా, నవంబరు ఒకటో తేదీన ఆస్ట్రేలియాలో జరుగనున్న దిల్జిత్ దోసాంజ్ మ్యూజిక్ కచేరీని అడ్డుకుంటామని కూడా ప్రకటించాడు.
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	ఈ పరిణామాలతో అప్రమత్తమైన కేంద్ర నిఘా వర్గాలు అమితాబ్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశాయి. వారి నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు భద్రతను మరింత పటిష్ఠం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.