ఎన్నికల అధికారిని బెదిరించిన సీఎం మమత ... ఈసీ సీరియస్
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మనోజ్ అగర్వాల్ను బెదిరించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సంఘటనను కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ హెచ్చరికలకు సంబంధించిన వీడియోు అందజేయాలని ఈసీని కోరినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
బెంగాల్ సీఈవోగా మనోజ్ అగర్వాల్ రాష్ట్రంలోని అధికారులను బెదిరిస్తున్నారని, తన పరిధిని దాటి వ్యహరిస్తే ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణలను బహిర్గతం చేస్తానని మమతా బెనర్జీ ఇటీవల ఒక సమావేశంలో వ్యాఖ్యానించినట్టు సమాచారం.
సీఎం మమత చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఫుటేజీని, దాని అనువాద ప్రతిని అందజేయాలని సీఈవో కార్యాలయానికి ఈసీ సూచనలు జారీచేసినట్టు తెలుస్తోంది. మమతా బెనర్జీ వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ విపక్ష నేత సువేందు అధికారి, బీజేపీ ఎమ్మెల్యేల బృందం ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాయగా దానిపై ఈసీ స్పందించింది. అలాగే, ఎన్నికల అధికారిని బెదిరించినందుకు ముఖ్యమంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు.