గురువారం, 6 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (05:29 IST)

మృత్యుంజయురాలా... సర్పంజయురాలా? 34 సార్లు కాటేసినా బతకడమా?

భయంకరమైన విషసర్పం శ్వేతనాగు 34సార్లు కరిచినా ఆరోగ్యంగానే ఉన్న మనీషాను చూసి అందరూ మృత్యుంజయురాలు కాదు సర్పంజయురాలు అంటున్నారు.

భయంకరమైన విషసర్పం శ్వేతనాగు 34సార్లు కరిచినా ఆరోగ్యంగానే ఉన్న మనీషాను చూసి అందరూ మృత్యుంజయురాలు కాదు సర్పంజయురాలు అంటున్నారు. ఒక్కసారి విష పాము కరిస్తేనే బతకడం కష్టం. అలాంటిది 34 సార్లు కరిస్తే.. బతికే అవకాశముంటుందా.. కానీ ఓ అమ్మాయి బతికేసింది.  హిమాచల్‌ ప్రదేశ్‌లోని శ్రీమౌర్‌లో 18 ఏళ్ల మనీషా అనే అమ్మాయి 34 సార్లు పాములు కరిచినా ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉంది. అయితే ఇందులో 26 సార్లు ఆమెను శ్వేతనాగే (తెల్లని త్రాచుపాము) కరవడం విశేషం.
 
ఆమె ఎక్కడున్నా ఆ శ్వేతనాగు వచ్చి కాటేసి వెళ్లిపోతోందట. మొదటిసారి స్థానిక నది సమీపంలో పాము కరిచిందని, ఆ తర్వాత ఒక్కోరోజు రెండు మూడుసార్లు కూడా శ్వేతనాగు కరిచేదని చెబుతోంది. ఆ తర్వాత మరికొన్ని పాములు కూడా తనను కాటేశాయని, గడిచిన మూడేళ్లలో మొత్తం 34 సార్లు తాను పాము కాటుకు గురయ్యానని చెప్పింది. అయినా తనకేమీ కాకపోవడం వెనుక నాగదేవతే ఉందని నమ్ముతోంది. 
 
తనకు నాగ దేవతకు ఏదో సంబంధం ఉండటం వల్లే పాము కాటు తనను ఏం చేయలేకపోతుందని జ్యోతిష్యులు, పూజారులు చెప్పినట్టు ఆ అమ్మాయి చెబుతోంది. కానీ విషం లేని, తక్కువ విషం కలిగిన పాములు కుట్టడం వల్లనే మనీషా ప్రాణానికి ప్రమాదం తప్పుతోందని డాక్టర్లు చెబుతున్నారు. మెడికల్‌ రిపోర్టుల ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి 18 వరకు మనీషాకు 34 సార్లు పాములు కరిచినట్టు గుర్తించినట్టు తెలిసింది.
 
తాజాగా ఫిబ్రవరి 18న మరోసారి పాము కరవడంతో మనీషా ఆసుపత్రిలో చేరింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్‌ వైఎస్‌ మెడికల్‌ కాలేజీ, హాస్పిటల్‌ మెడికల్‌ సూపరిటెండెంట్‌ డాక్టర్‌ కేకే ప్రసాద్‌ చెప్పారు. ‘పాము కాటుకు గురైన లక్షణాలతో మనీషా ఆసుపత్రిలో జాయిన్‌ అయింది. ఇది విషం లేని పాముగా గుర్తించాం. ఇక్కడ ఉండే 80 శాతానికి పైగా పాముల్లో విషం ఉండదు’అని డాక్టర్‌ తెలిపారు.