గోద్రా అల్లర్ల కుట్రదారుడు.. 14 యేళ్ల తర్వాత అరెస్టు
గుజరాత్ రాష్ట్రంలో 2002 ఫిబ్రవరిలో గోద్రా స్టేషన్ సమీపంలో కొందరు వ్యక్తులు సబర్మతి ఎక్స్ప్రెస్ రైలుపై దాడిచేసి దానికి నిప్పుపెట్టడంతో రైలు దహనమైంది. దాదాపు 60 మంది ప్రయాణికులు (వీహెచ్పీ కార్యకర్తలు) సజీవదహనమయ్యారు. ఈ ఘటన గుజరాత్లోని గోద్రాలో తీవ్ర అల్లర్లకు కారణమైంది. గోద్రా అల్లర్లలో దాదాపు వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయారు. 2011 ఫిబ్రవరిలో గోద్రా రైలు దగ్ధం కేసులో ప్రత్యేక కోర్టు 31 మందిని దోషులుగా నిర్ధారించి వారిలో 11 మందికి మరణశిక్ష, 20 మందికి జీవితఖైదు విధించింది. ఆరుగురు దోషులు పరారీలో ఉన్నారు.
ఈనేపథ్యంలో... ఈ రైలు దగ్ధం కేసులో ఘటన జరిగి 14 ఏళ్ల తర్వాత ప్రధాన కుట్రదారు ఫరూక్ భానా అరెస్టయ్యాడు. గుజరాత్ ఉగ్రవాద వ్యతిరేక స్క్వాడ్ పోలీసులు బుధవారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. మాజీ మున్సిపల్ కౌన్సిలర్ అయిన ఫరూక్ భానా రైలు దగ్ధం చేయడానికి కుట్రపన్నాడని పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేశారు. 14 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న ఫరూక్ను గుజరాత్లో కలోల్ టోల్ నాకా వద్ద పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.