శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 22 ఫిబ్రవరి 2020 (09:47 IST)

ఫిట్నెస్ పరీక్ష : గుంపుగా నగ్నంగా నిలబెట్టి...

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో సభ్య సమాజం తలదించుకునే చర్య ఒకటి జరిగింది. ఫిట్నెస్ పరీక్షల పేరుతో కొంతమంది అమ్మాయిలను గుంపుగా నగ్నంగా నిలబెట్టారు. వారికి అసభ్యకర రీతిలో ప్రశ్నలు సంధించారు. గురువారం జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చి తీవ్ర సంచలనంగా మారింది. దీంతో స్పందించిన మునిసిపల్‌ కమిషనర్‌ బన్‌చానిది పాణి ఈ ఘటనపై విచారణ కోసం ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ మునిసిపల్ కార్పొరేషన్‌లో 100 మంది యువతులు మూడేళ్ల క్లర్క్ ఉద్యోగ శిక్షణను పూర్తిచేసుకున్నారు. ఉద్యోగం పర్మినెంట్ కావాలంటే ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి అనే నిబంధన ఉంది. దీంతో ఫిట్నెస్ పరీక్ష కోసం మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వరంలో నడుస్తున్న సూరత్ మునిసిపల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఎస్ఎంఐఎంఈఆర్)కు వారిని తీసుకెళ్లారు. 
 
అక్కడ ఒక్కొక్కరికీ విడివిడిగా వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన గైనకాలజీ వైద్యులు 10 మందిని ఒకేసారి పిలిచి దుస్తులు విప్పించి నగ్నంగా నిలబెట్టారు. పరీక్షలకు వెళ్లిన వారిలో పెళ్లికాని యువతులు కూడా ఉన్నారు. తమను అసభ్యకర ప్రశ్నలు అడగడంతోపాటు ప్రెగ్నెన్సీ టెస్టులు కూడా చేశారని యువతులు వాపోయారు. ఈ వ్యవహారం లీక్ కావడంతో విచారణకు ఆదేశించారు.