గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 7 ఆగస్టు 2024 (13:54 IST)

నా సంతోషం కోసమే... రూ.228 కోట్లు విరాళంగా ఇచ్చా.. కృష్ణ చివుకుల

krishna chivukula
ఐఐటీ మద్రాస్‌ నుంచి వచ్చే ఇంజనీర్లకు అమెరికాలో మంచి పేరుతో పాటు గుర్తింపు ఉందని అది చూసి తాను ఎంతో గర్వపడుతుంటానని ఇండో ఎంఐఎం సీఈవో కృష్ణ చివుకుల అన్నారు. తాను విద్యాభ్యాసం చేసిన ఐఐటీ ఎం నుంచి తన దాతృత్వ కార్యక్రమాలు కొనసాగించాలని నిర్ణయించుకుని ఐఐటీఎంకు రూ.228 కోట్లను విరాళం ఇచ్చినట్టు తెలిపారు. 
 
ఆయన మంగళవారం మద్రాస్ ఐఐటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్ కామకోటితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఐఐటీ మద్రాస్‌కు రూ.228 కోట్ల విరాళం అందించాను. దేశంలోని ఏ యూనివర్సిటీకి కూడా ఒకేసారి ఇంత పెద్దమొత్తం వచ్చిన దాఖలా లేదు. ఇదంతా ఎందుకు చేస్తున్నానని కొందరు అడుగుతున్నారు. నేను ఆనందంగా ఉండాలి.. తద్వారా నా ఆరోగ్యం బాగుండాలని చేస్తున్నాను. ఇంతకుమించి నేనేమీ ఆశించడం లేదు' అని చెప్పారు. 
 
గత 55 యేళ్లుగా అమెరికాలో ఉంటున్నా. అక్కడి యూనివర్సిటీలకు ధనికులు విరివిగా విరాళాలు ఇస్తుంటారు. సమాజంలో విద్య, ఆరోగ్యం పెంచేందుకు, పేదరికం నిర్మూలించేందుకు ఆర్థికంగా అండగా నిలబడతారు. నా దేశానికి సేవ చేయాలని నాకూ ఎన్నో ఏళ్లుగా మనసులో బలంగా అనిపిస్తోంది. అమెరికావాళ్లు సైతం ఐఐటీ మద్రాస్ నుంచి వచ్చే ఇంజినీర్లను చూసి ఆశ్చర్యపోతుండటం చూశాను. అలాంటిచోట నేను చదువుకున్నాను. అందుకే నా దాతృత్వ కార్యక్రమాలు ఇక్కడి నుంచే మొదలు పెట్టాలని అనుకున్నాను అని చెప్పారు. 
 
తాను ఇచ్చి నిధులతో ఐఐటీ మద్రాస్‌లో పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందుతాయి. క్రీడాకారులకు ప్రోత్సాహం దక్కుతుంది. క్యాంపస్ నుంచి విడుదలవుతున్న మ్యాగజైన్లకు నిధుల లభ్యత ఏర్పడుతుంది. ఐదు కేటగిరీల్లో క్యాంపస్‌కు 25 ఏళ్ల పాటు ఎలాంటి డోకా ఉండదు అని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో గతంలోనే పరిశ్రమలు ఏర్పాటు చేశామని వాటిని మరింతగా విస్తరిస్తామని పేర్కొన్నారు. కృష్ణా చివుకుల సేవలకు గుర్తుగా ఐఐటీ మద్రాస్‌లోని ఓ అకడమిక్ బ్లాక్‌కు అధికారులు ఆయన పేరు పెట్టారు.