శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 ఆగస్టు 2020 (18:46 IST)

సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి మరో కేంద్ర మంత్రి రవిశంకర్

కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన గుర్గావ్‌లో ఉన్న మేదాంత ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే, ఆయనతో భేటీ అయిన వారంతా ఇపుడు సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియా సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లగా, ఇపుడు మరో కేంద్ర ఐటీ, టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. 
 
తనను కలిసిన అందరూ ఐసొలేషన్‌లోకి వెళ్లాలని, కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని అమిత్ షా సూచించిన సంగతి తెలిసిందే. దీంతో, ఆయనను కలిసిన పలువురు ఇప్పటికే ఐసొలేషన్‌లోకి వెళ్లిపోయారు. మరోవైపు, దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో ఏకంగా 50 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే పులువురు రాజకీయ, సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో సైతం కేసుల సంఖ్య పెరుగుతోంది.
 
మరోవైపు, దేశంలో కొవిడ్‌-19 కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా భారీగా పెరిగిపోతోంది. కరోనా కేసుల సంఖ్య 18 లక్షల మార్కును దాటింది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో భారత్‌లో 52,972 మందికి కొత్తగా కరోనా సోకింది. అదేసమయంలో 771 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 18,03,695కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 38,135కి పెరిగింది. 5,79,357 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 11,86,203 మంది కోలుకున్నారు.
 
కాగా, నిన్నటి వరకు మొత్తం 2,02,02,858 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)  తెలిపింది. నిన్న ఒక్కరోజులో 3,81,027 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది.