1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 6 నవంబరు 2019 (19:55 IST)

మాకు ఆ జాతి కుక్కలు కావాలంటున్న కేరళ పోలీసులు, ఎందుకు?

ఐసిస్ నాయకుడు అబూబకర్ అల్-బాగ్దాది మరణానికి ఓ జాగిలం కీలకంగా సహాయపడిన సంగతి తెలిసిందే. ఈ జాగిలం 'బెల్జియన్ మాలినోయిస్' జాతికి చెందింది. బాగ్దాదీని మట్టుబెట్టేందుకు అతడి ఆచూకీ కనిపెట్టేందుకు నిఘా నేత్రాలు సైతం విఫలమయ్యాయి. కానీ, ఆ జాగిలం మాత్రం ఖచ్చితంగా పసిగట్టి, అతడిని వెంటాడి హతమార్చింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ట్విట్టర్ ద్వారా తెలిపిన సంగతి తెలిసిందే.
 
ఇపుడు ఈ కుక్క సంగతి ఎందుకంటే, ఇదే జాతికి చెందిన జాగిలాలను కేరళ పోలీసులు దిగుమతి చేసుకుంటున్నారు. తద్వారా తమ డాగ్ స్క్వాడ్‌ను బలోపేతం చేసుకుంటున్నారు. ఇటీవల పాలక్కాడ్‌లోని అట్టాపాడిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులను రాష్ట్ర పోలీసులు కాల్చి చంపిన తరువాత ఈ విషయంలో నిర్ణయం తీసుకున్నారు.
 
కేరళ పోలీసులు పంజాబ్ కెన్నెల్ ఇనిస్టిట్యూట్ నుండి ఐదు 'బెల్జియన్ మాలినోయిస్' జాతి కుక్కలతో సహా 15 కుక్కలను కొనుగోలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు. కాగా రాష్ట్ర పోలీసు శాఖ డాగ్ స్క్వాడ్‌లో పదకొండు కుక్కలు పదవీ విరమణ అంచున ఉన్నాయి. మొత్తం 150 జాగిలాల బలం కలిగి వుండాల్సిన కేరళ డాగ్ స్క్వాడ్‌లో ప్రస్తుతం 127 కుక్కలు మాత్రమే ఉన్నట్లు వర్గాలు తెలిపాయి.